
Kerala: మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని ఇటీవల కేరళకు చెందిన గ్రాండ్ ముఫ్తీ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అయితే, ఈ వ్యాఖ్యలపై కేరళ సీఎం వీడీ సతీషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పబ్లిక్లోకి వస్తే ‘‘తీవ్ర విధ్వంసం’’ జరుగుతుందని ముస్లిం మతపెద్ద చేసిన వ్యాఖ్యలను తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ‘‘ మహిళలు పబ్లిక్లోకి వస్తే తీవ్ర నష్టం జరుగుంది. మహిళలు విధేయులుగా ఇళ్లలోనే ఉండాలని ఖురాన్ చెబుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించం. మా ప్రభుత్వం కానీ, మా పార్టీ కానీ ఈ వైఖరికి మద్దతు ఇవ్వదు’’ అని సతీషన్ అన్నారు.
మహిళలు సమాజంలోని అన్ని రంగాల్లో ఉండాలన్నదే తమ ప్రగతిశీల వైఖరి అని కేరళ సీఎం అన్నారు. మహిళలు అణచివేతకు లోనై ఇళ్లకే పరిమితం కావాలన్న భావన 19వ శాతాబ్ధపు ఆలోచన అని అన్నారు. మహిళలు విధేయులుగా ఇళ్లలోనే ఉండాల్సిన అవసరం లేదని, వారు ప్రజా జీవితంలో, సామాజిక జీవితంలో అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొనాలని అన్నారు. గ్రాండ్ ముఫ్తీ వ్యాఖ్యలు ఇస్లాం బోధనలకు సరైన ప్రతిరూపం కాదని సతీషన్ అన్నారు. ప్రవక్త మహమ్మద్ తొలి భార్య ప్రముఖ వ్యాపారవేత్త అని, ఆయిషా ‘బ్యాటిల్ ఆఫ్ ది క్యామెల్’లో కీలక పాత్ర పోషించారని, రాణి బిల్కిస్ ఒక పాలకురాలిగా ఉన్నారని గుర్తుచేశారు.
గ్రాండ్ ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. మత పెద్ద ఆదేశాలతో కేరళలోని బాలికలను మధ్యయుగపు నిర్భందంలోకి నెట్టలేరని అన్నారు. కాంగ్రెస్, సీపీఎంలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని ఆయన ప్రశ్నించారు. మహిళలు పితృస్వామ్య భావజాలాన్ని వ్యతిరేకించాలని చెబుతున్న రాహుల్ గాంధీ, గ్రాండ్ ముఫ్తీ వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.