July 14, 2026

TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?

TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
Reading Time: 2 minutes
Tvk Vijay Holds Talks With Legal Experts Over Tamil Nadu Government Formation

తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. విజయ్ వర్సెస్ గవర్నర్ అన్న రీతిలో ఫైటింగ్ సాగుతోంది. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ మొండిపట్టుపై మేధావులు, ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేను ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. విజయ్ మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోవడంపై విజయ్ న్యాయ నిపుణులతో సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. తదుపరి కార్యాచరణపై మేధావులతో చర్చిస్తున్నారు. న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ లాంటి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించిన గత పరిస్థితిని న్యాయ బృందం పరిగణనలోకి తీసుకుంటోందని వర్గాలు తెలిపాయి. ఆ విధంగానే విజయ్‌ను ఎందుకు పిలవడం లేదని.. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం చట్టపరమైన, రాజకీయ మార్గాలన్నింటినీ పరిశీలిస్తున్నామని కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి గిరీష్ చోడంకర్ చెప్పారు.

ఇదిలా ఉంటే గవర్నర్ తీరుపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తే తక్షణమే స్పందన రాకపోవచ్చని న్యాయ నిపుణులు చెప్పినట్లు తెలుస్తోంది. అయినా ప్రస్తుతం న్యాయస్థానాలు వేసవి సెలవుల్లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కోర్టును ఆశ్రయించకపోవడమే బెటర్ అన్నట్టుగా సమాచారం. అందుకోసమే తక్షణ కర్తవ్యంగా వామపక్షాలు, వీసీకే పార్టీల మద్దతుతో ముందుకెళ్లాలని విజయ్ భావిస్తున్నారు. ఇప్పుటికే ఆ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. ఏ విషయం అన్నది రేపు చెబుతామన్నారు. అంతా సానుకూలం అయితే మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోతాయి.

అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగ విజ్ఞతకు నిలయమైన గవర్నర్‌కు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమిళనాడులోని అతిపెద్ద పార్టీని పిలవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.’’ అని అన్నారు.

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సోమవారం వెలువడిన ఫలితాల్లో టీవీకే 108, డీఎంకే 59, ఏఐడీఎంకే 47, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, సీవీకే 2, ముస్లిం లీగ్ 2 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతును విజయ్‌కు ప్రకటించింది. దీంతో విజయ్ బలం 112కు చేరింది. వామపక్షాలు, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు మద్దతు ఇస్తే మాత్రం విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈజీ అవుతుంది. ఆ పార్టీల దగ్గర 6 సీట్లు ఉన్నాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ 118కు చేరుతుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోతాయి. అయితే రేపు ఏం జరగబోతుందో వేచి చూడాలి.