
మలయాళ పరిశ్రమలో చిన్న సినిమాల నుంచి పెద్ద స్టార్ల వరకు అందరూ సీక్వెల్స్తో వచ్చి రికార్డులు సృష్టిస్తున్నారు. కంటెంట్ ఉన్న కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. ఇటీవల వచ్చిన సీక్వెల్ సినిమాలను ఒకసారి పరిశీలిస్తే.. 2024లో వచ్చిన ‘వాళా’ కంటే ఇటీవల వచ్చిన సీక్వెల్ ‘వాళా 2’ అద్భుతమైన పర్ఫామెన్స్తో దూసుకుపోతోంది. నలుగురు సగటు కుర్రాళ్ల జీవితం చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ సినిమా రూ. 234 కోట్ల వసూళ్లతో 2026 ఏడాదికి గానూ మలయాళంలో హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టిందనే చెప్పాలి.
ఇక జయసూర్య ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఆడు 3‘ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. షాజీ పాపన్ క్యారెక్టర్కు ఉన్న క్రేజ్ను మరోసారి నిరూపిస్తూ ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలాగే సాయిజు కురుప్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘భరతనాట్యం 2 మోహినీయాట్టం’ కూడా అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 17 రోజుల్లోనే రూ. 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇక మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ‘దృశ్యం 3′. మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 21న విడుదల కాబోతోంది. జార్జ్ కుట్టి మళ్ళీ పోలీసులకు దొరకకుండా తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఇప్పటికే యూఎస్ ప్రైవేట్ బుకింగ్స్లో ఈ సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సీక్వెల్స్ ప్రభంజనం చూస్తుంటే మలయాళ సినిమా సరికొత్త శిఖరాలకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.