Reading Time: < 1 minute
CBSE 10th 2nd board exams: సీబీఎస్‌ఈ పదో తరగతి రెండో విడత పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు

హైదరాబాద్‌, ఏప్రిల్ 25: మే 15 నుంచి 21 వరకు జరగనున్న సీబీఎస్సీ సెకండ్‌ బోర్డు పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షల కోసం మొత్తం 6,68,854 మంది రెగ్యులర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా 4.74 లక్షల మంది విద్యార్థులు కేవలం సైన్స్ సబ్జెక్టులోనే మార్కుల ఇంప్రూవ్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సీబీఎస్సీ వెల్లడించింది. ఇక వీరిలో 5,25,655 మంది ఇంప్రూవ్‌మెంట్ కేటగిరీకి, 85,285 మంది కంపార్ట్‌మెంట్ కేటగిరీ కింద, 57,914 మంది కంపార్ట్‌మెంట్ & ఇంప్రూవ్‌మెంట్ రెండు కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో బాలురు 4,02,643 మంది, బాలికలు 2,66,209 మంది ఉన్నారు.

కాగా CBSE 2026 నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షల కోసం రెండు-ఎడిషన్ల విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రధాన పరీక్షలకు హాజరు కావల్సి ఉంటుంది. అయితే సెకండ్‌ బోర్డు పరీక్షలకు కంపార్ట్‌మెంట్ కేటగిరీలో ఉన్నవారికి, మెరుగుదల కోరుకునే వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. రెండు పరీక్షలలోనూ వచ్చిన అత్యుత్తమ మార్కులను బోర్డు జారీ చేసే మార్క్ షీట్-కమ్-సర్టిఫికేట్‌లో పరిగణనలోకి తీసుకుని విద్యార్ధులకు అందిస్తారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపిన ప్రకారం.. సెకండ్‌ బోర్డు పరీక్షలు 2026 మే 15వ తేదీ నుండి ప్రారంభమై, 2026 మే 21వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షల తేదీల షెడ్యూల్‌ను ఇప్పటికే బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజెస్‌లలో ఏవైనా మూడు సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశాన్ని బోర్డు కల్పించింది. ఇక రెండో విడత ఫలితాలు జూన్ నెలాఖరు నాటికి విడుదలవనున్నాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.