
RTC Strike Ends: తెలంగాణలో గత మూడు రోజులుగా ఉత్కంఠ రేపిన ఆర్టీసీ సమ్మెకు తెరపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందంతో ఆర్టీసీ జేఏసీ (JAC) జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సుమారు 15 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల అనంతరం కార్మికుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు ప్రకటించడంతో జేఏసీ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది.
చర్చల్లోని కీలక నిర్ణయాలు ఇవే..
ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. సంస్థ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ వెసులుబాటును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం కీలక అడుగు వేసింది. విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు, కార్మిక సంఘాల నేతలతో కూడిన ఒక అధికారిక కమిటీని ప్రభుత్వం నియామకం చేసింది. అలాగే ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి తక్షణమే ఏర్పాట్లు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించింది. మిగిలిన చిన్నపాటి సమస్యలను ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు కలిసి చర్చించుకుని పరిష్కరించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ఆర్టీసీ మన కుటుంబం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
చర్చల అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. “ఆర్టీసీ ఒక కుటుంబం లాంటిది. కార్మికుల సమస్యల పట్ల ప్రజా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అందుకే సుదీర్ఘంగా చర్చించి విలీనం, పీఆర్సీ వంటి కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చర్చలు విజయవంతమైన నేపథ్యంలో కార్మికులు శనివారం తెల్లవారుజాము నుంచే విధుల్లో చేరాలని కోరారు. ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు యధావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. రాజకీయంగా ఈ సమ్మెను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగినప్పటికీ, కార్మికులు సంయమనంతో ఉన్నారని ఆయన అభినందించారు. ప్రభుత్వ నిర్ణయాలతో హర్షం వ్యక్తం చేసిన ఆర్టీసీ జేఏసీ, శనివారం రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద ఉత్సవాలు నిర్వహించుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చింది. ఈ చర్చల్లో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎస్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.