Reading Time: < 1 minute
Chicken Price Hike Chicken Prices Hit Rs 400 Per Kg In Telugu States

Chicken Prices Hit RS 400 Per kg in AP and Telangana: నాన్‌వెజ్ ప్రియులకు భారీ షాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కిలో చికెన్ ధర ఏకంగా రూ.400 (స్కిన్‌లెస్)కు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో బోన్‌లెస్ రూ.400కి పైగా విక్రయిస్తున్నారు. విజయవాడలో ఈరోజు కేజీ రూ.400గా నమోదయింది. గత వారం కిలో చికెన్ రూ.300గా ఉండగా.. ఇప్పుడు 400కు చేరింది. ఒక్కసారిగా రూ.100 పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. చికెన్ ధర ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేజీ చికెన్‌ ధర సాధారణంగా రూ.170 నుంచి రూ.220 మధ్య ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసంలో అయితే ఇంకా తక్కువగా ఉంటుంది. కానీ గత 2 నెలల నుంచి ధరల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి మధ్య నుంచి భారీగా పెరుగుతోంది. ఎండల తీవ్రత కారణంగా కోళ్లు చనిపోవడం, రంజాన్ డిమాండ్ కారణంగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.400కు చేరడంతో కొనుగోలుదారులు వెనుదిరుగుతున్నారు. ‘వామ్మో.. నాలుగొందలు పెట్టి చికెన్ కొనాలా?’ అంటూ చాలామంది మార్కెట్ వద్దే వెనక్కి వెళ్లిపోతున్నారు.

ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజలపై పెను భారం పడింది. ఈ సమయంలో చికెన్ ధరలు కూడా పెరగడంతో పరిస్థితి మరింత కష్టంగా మారింది. రోజువారీ ఖర్చులు పెరుగుతుండటంతో.. మాంసాహారం కొనడం కూడా చాలా మందికి భారంగా మారుతోంది. ధరలు పెరగడంతో చికెన్ మార్కెట్‌లో కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. దాంతో వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కస్టమర్లు రాకపోవడంతో చికెన్ మార్కెట్ వెలవెలబోతోంది. విక్రయాలు తగ్గిపోవడంతో వ్యాపారులకు తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు సరఫరా కొరత, డిమాండ్-సప్లై అసమతుల్యత అని వ్యాపారులు చెబుతున్నారు.