Reading Time: < 1 minute
Telangana Urea Distribution App Mandal Level Updates

తెలంగాణలో యూరియా పంపిణీ కోసం ప్రారంభించిన యాప్‌లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా యూనిట్‌గా యూరియా పంపిణీ జరగ్గా.. ఇక నుంచి మండలం లేదా రెండు మండలాలు లేదా నియోజకవర్గం ప్రాతిపాదికన ఈ పంపిణీ జరగనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆ మేరకు యాప్ లో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా.. యూరియా పంపిణీ సరిగ్గా నిర్వహించని ప్రైవేట్ డీలర్లపై కూడా నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో యూరియా పంపిణీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని వినియోగంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ రకాల సమస్యలు ఎదురయ్యాయి. స్లాట్ బుకింగ్ సరిగ్గా కాకపోవడం, దుకాణానికి వెళ్లినా అక్కడ నిల్వలు ఉండకపోవడం వంటి సమస్యలు ఎదురవ్వడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించారు. ఈ యాప్ ను సులభంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల్లోని వ్యవసాయ అధికారులు సమస్యలపై సమాచారం సేకరించి విశ్లేషణ చేశారు.

Also Read:Engineering Colleges: ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్..

ప్రస్తుతం జిల్లా యూనిట్‌గా యూరియా పంపిణీ జరుగుతుండగా.. రైతులు యాప్‌లో తమ జిల్లాల పరిధిలోని దుకాణాలను బుకింగ్ చేసుకుంటున్నారు. దీని కారణంగానే జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రద్దీ ఏర్పడుతోంది. దీని కారణంగానే యూరియా నిల్వలపై సమాచారం నమోదు అవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలించిన అధికారులు జిల్లా యూనిట్ స్థానంలో మండలం లేదా నియోజకవర్గాల వారీగా పంపిణీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.