Reading Time: < 1 minute
JEE Main 2026: జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రాత పరీక్షల తేదీలు ఇవే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5: జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనాయి. ఫిబ్రవరి 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఎన్‌టీఏ ప్రకటన విడుదల చేసింది. ఇక జేఈఈ మెయిన్‌ మలి విడత ఆన్‌లైన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఈ మేరకు పూర్తి నోటిఫికేషన్‌ను ఎన్టీయే విడుదల చేసింది.

కాగా జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జనవరి 29వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రాథమిక ఆన్సర్‌ కీ కూడా విడుదల చేసింది. కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడ అందుబాటులోకి తీసుకువచ్చింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ప్రాథమిక కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యంతరాలను లేవనెత్తడానికి ఫిబ్రవరి 6, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అవకాశం కల్పించినట్లు ఎన్టీయే పేర్కొంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్‌ కీ రూపొందించి ఫలితాలను వెల్లడించనుంది.

తుది విడత పరీక్షలు రాసిన అభ్యర్ధులు కూడా జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2కు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన అభ్యర్ధులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఇక రెండు విడతల పరీక్షలు రాసిన వారికి రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను అంతిమంగా పరిగణనలోకి తీసుకొని ఫైనల్‌ ర్యాంకు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్‌లో 1.50 ర్యాంకులు సాధించిన తొలి ర్యాంకర్లను జేఈఈ మెయిన్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ ఇప్పటికే విడుదలైంది.

జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 2 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.