Reading Time: < 1 minute
Tollywood: ఆ స్టార్ హీరో నేను రాగానే లేచి నిలబడతాడు.. తను ఎంత గొప్పవాడంటే.!

టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం, గొప్పతనం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలకృష్ణను “మహా గొప్ప వ్యక్తి”గా అభివర్ణించారు. బాలయ్య బాబులోని వినయం, సంస్కారం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. షూటింగ్ సమయంలో తాను ఎంట్రీ ఇవ్వగానే, బాలకృష్ణ వెంటనే లేచి నిలబడి, “కూర్చోండి గురువుగారు” అని తనను బలవంతంగా కూర్చోబెట్టేవారని గుర్తు చేసుకున్నారు. ఈ గౌరవం తనకు మాత్రమే కాదని, ఎవరైనా సరే బాలకృష్ణ అంత మర్యాద ఇస్తారని జయప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

బాలకృష్ణలో పెద్ద హీరోననే, గొప్ప కుటుంబం నుంచి వచ్చాననే గర్వం ఏమాత్రం లేదని, ఆయన మనస్తత్వం చిన్న పిల్లవాడిలా ఉంటుందని జయప్రకాష్ రెడ్డి అన్నారు. తన వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి జ్ఞాపకాలను కూడా బాలకృష్ణ ఇతరులతో పంచుకుంటారని చెప్పారు. బాలకృష్ణను “హ్యూమన్ కంప్యూటర్”గా అభివర్ణిస్తూ, ఆయన తండ్రి నటించిన సినిమాల్లోని పాత్రలు, మాటలు, పెద్ద డైలాగ్స్ అన్నింటినీ అవలీలగా చెబుతారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేర్చుకోవాలనే తపన ఆయనలో ఎప్పుడూ ఉంటుందని, మంత్రాలు, ఇతర విషయాలను నేర్చుకుని, “కరెక్టేనా?” అని అడుగుతారన్నారు. తనకు శివుడంటే ఇష్టమని బాలకృష్ణకు తెలుసని, అందుకే ఆయన తనను, తనికెళ్ళ భరణిని “ఓం నమశ్శివాయ” అంటూ పలకరిస్తారని చెప్పారు. బాలకృష్ణ కనపడితే ఐదుసార్లు “ఓం నమశ్శివాయ” అనాలని పట్టుబడతారని సరదాగా గుర్తు చేసుకున్నారు.

అలాగే తాను టీచర్‌గా పనిచేసినప్పటి నుంచి ఇతరుల కష్టనష్టాల్లో ఆదుకోవాలనే గుణం తనకు ఉందని జయప్రకాష్ రెడ్డి అన్నారు. తన మాట వినేవారికి, టాలెంట్ ఉన్నవారికి వేషాలు ఇప్పించాలని ప్రయత్నిస్తుంటానని తెలిపారు. చిన్న చిన్న ఆర్టిస్టులకు నెలకు రెండు మూడు రోజులు పని దొరికితే, ఇంటి అద్దె, పిల్లల పోషణ వంటి ఖర్చులు గడుస్తాయని, వారికి ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..