Reading Time: 2 minutes
Christmas Holidays 2025: రేపట్నుంచే క్రిస్మస్‌ సెలవులు.. అక్కడ స్కూళ్లకు ఏకంగా 20 రోజులు హాలిడేస్!

దేశ వ్యాప్తంగా చలి తీవ్రత నానాటికీ భయపెడుతుంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌ నమోదవుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్ధులకు క్రిస్మస్‌ సెలవులు రావడంతో కాస్త ఉపశమనం లభించినట్లైంది. రేపటి నుంచే అన్ని పాఠశాలలకు క్రిస్మస్‌ సెలవులు ప్రారంభమవుతున్నాయి. హాస్టల్స్‌లోని విద్యార్దులు ఈ రోజు సాయంత్రం నుంచే ఇళ్లకు బయల్దేరనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్‌ సందర్భంగా వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చింది. క్రిస్మస్‌కి ముందు రోజు ఈవ్‌ సందర్భంగా ఆప్షనల్‌ సెలవు ఇచ్చారు. దీంతో డిసెంబర్‌ 24 కూడా సెలవుగా రానుంది. క్రిస్మస్ ఈవ్ సెలబ్రేషన్స్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆప్షనల్‌ హాలిడే ఇచ్చాయి. ఇక డిసెంబర్ 25న క్రిస్మస్‌ పండగ సెలవు, డిసెంబర్ 26వ తేదీన బాక్సింగ్‌ డే కూడా సెలవు కావడంతో మొత్తం 3 రోజులు సెలవులు వచ్చాయి. డిసెంబర్‌ 27 నాలుగో శనివారం, డిసెంబర్ 28 ఆదివారం వచ్చాయి. ఉద్యోగులకు ఈ రెండు రోజులు వీకెండ్‌ సెలవులు వచ్చాయి. మొత్తంగా విద్యార్ధులకు మూడు రోజుల సెలవులు, ఉద్యోగులకు 5 రోజుల వరకు సెలవులు వచ్చాయి. మంగళవారం సాయంత్రం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. విద్యార్ధులు సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సులు, ట్రైన్‌ల వద్ద కిటకిటలాడుతూ కనిపించారు.

మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శీతాకాల సెలవులు వచ్చేస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో డిసెంబర్ 25, 2025 నుంచి జనవరి 5, 2026 వరకు విద్యా సంస్థలు మూతపడనున్నాయి. దీంతో మొత్తం 12 రోజుల పాటు శీతాకాల సెలవులు రానున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం క్రిస్మస్‌ రోజున అంటే డిసెంబర్ 25న విద్యా సంస్థలకు సెలవు ఉండబోదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం, సేవల ఆధారంగా ప్రత్యేక కార్యక్రమాలు, చర్చా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ఘనంగా జరుపుకోవడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ పాఠశాలలకు తప్పనిసరిగా హాజరు కావాలని యూపీ సర్కార్‌ పేర్కొంది.

ఇక పంజాబ్‌ రాష్ట్రంలో క్రిస్మస్‌కు సుదీర్ఘ సెలవులు వచ్చాయి. డిసెంబర్‌ 22 నుంచి జనవరి 10వ తేదీ వరకు అక్కడి ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. అంటే మొత్తం 20 రోజులన్నమాట. రాజస్థాన్‌లో 10 రోజులు శీతాకాల సెలవులు ఇచ్చారు. హర్యానాలో క్రిస్మస్‌ ఒక్క రోజే పండగ వచ్చింది. డిసెంబర్ 26 నుంచి స్కూళ్లు యథావిథిగా పనిచేస్తాయి. కేరళలో డిసెంబర్‌ 24 నుంచి జనవరి 4వ తేదీ వరకు, తెలంగాణలోని మిషనరీ స్కూళ్లలో డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు సెలువులు వచ్చాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.