Reading Time: 2 minutes
INDW vs SLW 2nd T20I: షెఫాలీ తుఫాన్ హాఫ్ సెంచరీ.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం..

విశాఖపట్నంలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోనూ రాణించింది. బౌలింగ్‌లో శ్రీలంకను కట్టడి చేసిన టీమ్ ఇండియా, బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించి సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది.

తడబడ్డ లంక..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. హర్షిత సమరవిక్రమ (33), కెప్టెన్ చమరి ఆటపట్టు (31) మినహా మిగిలిన వారు ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ (2/31), శ్రీ చరణి (2/23) తలా రెండు వికెట్లు తీయగా, స్నేహ రాణా (1/11), క్రాంతి గౌడ్ (1/21) పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టారు.

షఫాలీ వర్మ విధ్వంసం..

129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చింది. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన షఫాలీ, శ్రీలంక బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది.

ఓపెనర్ స్మృతి మంధాన (14) త్వరగానే అవుట్ అయినప్పటికీ, షఫాలీ, జెమిమా అందించిన వేగం వల్ల భారత్ కేవలం 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి విజయం సాధించింది.

ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. వరుసగా రెండు విజయాలతో టీమ్ ఇండియా మంచి ఊపులో ఉంది. మూడో టీ20 డిసెంబర్ 26న తిరువనంతపురంలో జరగనుంది.

భారత్ తుది జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, శ్రీ చరణి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..