Reading Time: < 1 minute
ఆహా.. ఏముంది సీన్..వేసవిలో మంచు విందు..పాల సముద్రాన్ని తలపిస్తున్న ప్రకృతి సోయగాలు..ఎక్కడో తెలుసా?

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం మాత్రం మంచుతో ముస్తాబై పర్యాటకులను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో భానుడు భగభగమంటుంటాడు. కానీ, అల్లూరి జిల్లాలోని అరకు, పాడేరు పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం అద్భుత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.

అల్లూరి ఏజెన్సీలో మండు వేసవిలో మంచు కురిసింది. తెల్లవారుజామున నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు శీతాకాలాన్ని తలపించేలా పొగమంచు దట్టంగా అలముకుంది. ఘాట్ రోడ్ లో పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. ఏజెన్సీలోని వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం కొన్నిచోట్ల పొగ మంచు, 11 గంటల తర్వాత భారీగా ఎండ, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిక వాతావరణం మారి ఇప్పుడే రోజులుగా వర్షం కురుస్తుంది. శనివారం ఉదయం పొగమంచు కమ్మేసింది. మినుములూరు లో 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అరకులో 15 పాడేరులో 16డిగ్రీలు, చింతపల్లిలో 20 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ముందు రోజు భారీగా ఉష్ణోగ్రతలు నమోదైతే మరుసటి రోజు ఏజెన్సీలో ఇటువంటి వాతావరణం కనిపిస్తుందని అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.

పాలసముద్రంలా వంజంగి..

ఏజెన్సీలో పొగ మంచు కారణంగా ప్రకృతి రమణీయ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. వంజంగి మేఘాలకొండ లోయలు.. మంచు కారణంగా పాల సముద్రాన్ని తలపిస్తోంది. పాడేరు ఏజెన్సీలో పలుచోట్ల వాతావరణం ఆహ్లాదంగా మారింది. ఉదయాన్నే ఆ పొగ మంచు తెరలనుంచి ఉదయభానుడు.. లేలేత కిరణాలతో పలకరించాడు. పండు వేసవిలో సుందర ప్రకృతి దృశ్యాలు కనువిందుతో పర్యాటకులు సందడి చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి