
- 27.29 లక్షల టన్నుల నుంచి 23.79 లక్షల టన్నులకు తగ్గుదల
- మొత్తం 2025-26 లో ఎల్పీజీ వినియోగం 3.32 కోట్ల టన్నులు
- బొగ్గు గ్యాసిఫికేషన్తో ఎల్పీజీలో 20 శాతం డీఎంఈ బ్లెండింగ్
- ఏటా రూ.34,200 కోట్ల ఆదా
న్యూఢిల్లీ: ఇండియాలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ– వంట గ్యాస్) వినియోగం ఈ ఏడాది మార్చిలో 13శాతం పడిపోయింది. యుద్ధ ప్రభావంతో మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే గ్యాస్ సప్లయ్లో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా వంట గ్యాస్ వాడకం ఇండ్లలో, హోటల్స్లో తగ్గింది. మార్చిలో ఎల్పీజీ వినియోగం 23.79 లక్షల టన్నులుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది 27.29 లక్షల టన్నులుగా ఉంది. ఇండియా ఎల్పీజీ అవసరాల్లో 60శాతం దిగుమతుల ద్వారా అందుతోంది.
హార్మూజ్ జలసంధి మూతపడడంతో సౌదీ, యూఏఈ నుంచి సరఫరాలు ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వం హోటళ్లు, పరిశ్రమలకు సరఫరాను తగ్గించి, ఇండ్లకు ప్రాధాన్యం పెంచింది. ఆయిల్ మినిస్ట్రీకి చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్ (పీపీఏసీ) డేటా ప్రకారం, ఈ ఏడాది మార్చిలో ఎల్పీజీ గృహ వినియోగం ఏడాది లెక్కన 8.1శాతం తగ్గి 22.19 లక్షల టన్నులుగా నమోదైంది. వాణిజ్య వినియోగం అయితే ఏకంగా 48శాతం పడిపోయింది. ఇండస్ట్రీలకు అమ్మే బల్క్ ఎల్పీజీ అమ్మకాలు 75.5శాతం తగ్గాయి.
ఏటీఎఫ్ వినియోగం మారలే
కొరతను తగ్గించడానికి ఆయిల్ రిఫైనరీ కంపెనీలు పెట్రోకెమికల్ ఉత్పత్తి నుంచి వచ్చే బై ప్రొడక్ట్లను ఎల్పీజీ ఉత్పత్తికి మళ్లించాయి. దీంతో దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి మార్చిలో 14 లక్షల టన్నులకు పెరిగింది. కిందటేడాది మార్చిలో ఇది 11 లక్షల టన్నులుగా ఉంది. మొత్తం 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎల్పీజీ ఉత్పత్తి 1.28 కోట్ల టన్నుల నుంచి 1.31 కోట్ల టన్నులకు చేరినా, వినియోగం కూడా 6 శాతం పెరిగి 3.32 కోట్ల టన్నులకు పెరిగింది.
మరోవైపు విమానాల్లో వాడే ఇంధనం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) వినియోగం మార్చిలో 8,07,000 టన్నులు దగ్గర స్థిరంగా ఉంది. ఇరాన్ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్లో ఎయిర్ స్పేస్ క్లోజ్ అయ్యింది. అలానే విమాన సర్వీస్ల రద్దు వల్ల ఏటీఎఫ్ వినియోగం ఫ్లాట్గా ఉంది. ఈ ఏడాది మార్చిలో పెట్రోల్ అమ్మకాలు ఏడాది లెక్కన 7.6శాతం పెరిగి 37.8 లక్షల టన్నులకు, డీజిల్ అమ్మకాలు 8.1శాతం పెరిగి 87.27 లక్షల టన్నులకు చేరాయి.
మొత్తం 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏటీఎఫ్ వినియోగం 2శాతం పెరిగి 91.61 లక్షల టన్నులకు, పెట్రోల్ 6.5శాతం పెరిగి 4.26 కోట్ల టన్నులకు, డీజిల్ 3.6శాతం పెరిగి 9.47 కోట్ల టన్నులకు ఎగిశాయి. ఇండస్ట్రియల్ ఫ్యూయల్స్ నాఫ్తా వినియోగం 2025–-26 లో 9.9శాతం, ఫ్యూయల్ ఆయిల్ 1.4శాతం తగ్గగా, రోడ్ల నిర్మాణానికి ఉపయోగించే బిటుమెన్ 3శాతం పెరిగి 88.4 లక్షల టన్నులకు
చేరింది.
బొగ్గు గ్యాసిఫికేషన్ తో మేలు
బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అయిన డైమిథైల్ ఈథర్ (డీఎంఈ)ని ఎల్పీజీలో 20 శాతం వరకు బ్లెండింగ్ చేసి వాడితో ఇండియా ఏడాదికి 4.04 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.34,200 కోట్ల) ఫారెక్స్ నిల్వలను ఆదా చేయగలుగుతుందని రిపొర్ట్ ఒకటి అంచనా వేసింది. 20 శాతం బ్లెండింగ్తో ఏడాదికి 63 లక్షల టన్నుల ఎల్పీజీ దిగుమతులను తగ్గించుకోవచ్చని రీసెర్చ్ కంపెనీ ఈవై-పార్థీనాన్, న్యూ ఎరా క్లీన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసిన రిపోర్ట్ పేర్కొంది.
బొగ్గు గ్యాసిఫికేషన్లో బొగ్గును నేరుగా కాల్చకుండా, ఆక్సిజన్, ఆవిరితో అధిక ఉష్ణోగ్రతల్లో రసాయనిక చర్యలకు గురి చేసి కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నీటి ఆవిరి మిశ్రమం వంటి “సైన్గ్యాస్”ను ఉత్పత్తి చేస్తారు. ఈ సైన్గ్యాస్ను డీఎంఈ వంటి ఇంధనాల తయారీలో ఉపయోగిస్తారు. డీఎంఈని ఎల్పీజీకి ప్రత్యమ్నాయంగా వాడుకోవచ్చు.
ప్రస్తుతం భారత్లో డీఎంఈ ఉత్పత్తి పైలట్ స్థాయిలో మాత్రమే ఉంది. న్యూ ఎరా క్లీన్టెక్ ఎండీ బాలాసాహెబ్ దరాడే మాట్లాడుతూ, స్పష్టమైన బ్లెండింగ్ పాలసీ ఉంటే పెట్టుబడులు పెరిగి, దేశీయంగా డీఎంఈ ఉత్పత్తి పెంచొచ్చని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డీఎంఈ ఉత్పత్తిలో చైనా 90శాతం వాటా కలిగి ఉంది.