Reading Time: < 1 minute
Telangana Government To Distribute Drones To Women Farmers

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన మహిళా రైతులకు ప్రభుత్వం భరోసానిస్తోంది. ఇందులో భాగంగా మహిళా రైతులను సాంకేతికంగా మరింత బలోపేతం చేసేందుకు.. వారికి త్వరలోనే డ్రోన్లను పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ క్రీడా ప్రాంగణంలో ఆదివారం ప్రారంభమైన ‘మెగా రైతుమేళా’లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఐక్యరాజ్యసమితి 2026ని ‘అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం’గా ప్రకటించిన నేపథ్యంలో.. ఈ మేళాకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ‘రూ. 500 కోట్ల వ్యయంతో పునరుద్ధరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మహిళా రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. మహిళలు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో.. రాబోయే రోజుల్లో వారికి డ్రోన్లను అందజేస్తాం’ అని పేర్కొన్నారు.

Also Read:Uric Acid: ఈ చిన్న చిట్కాలతో.. యూరిక్ యాసిడ్ పరార్..

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 25 లక్షల మంది రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీని విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన రాయితీ విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి కీలక పథకాలను పునరుద్ధరించి మళ్ళీ అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

రాష్ట్రంలో పంటమార్పిడి, సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తున్నామని, ప్రతి జిల్లాలో ఆయిల్ పాం పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే.. కొత్తగా మూడు వ్యవసాయ కళాశాలలను కూడా ప్రారంభించామని వెల్లడించారు.