
హైదరాబాద్, ఏప్రిల్ 20: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాలు ఈ రోజు (ఏప్రిల్ 20న) విడుదల కానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. తొలుత జేఈఈ మెయిన్ పేపర్ 1 ఫలితాలు వెల్లించనుంది. ఈ పరీక్షకు సంబంధించిన స్కోర్కార్డు సోమవారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ లేదా పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 8 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 304 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 11 లక్షలకు పైగా విద్యార్ధులు హాజరయ్యారు.
ఈ రోజు జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలతోపాటు.. అభ్యర్థి రెండు సెషన్లలో (జనవని, ఏప్రిల్) పాల్గొంటే రెండు సెషన్లలో ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకుని ఆల్ ఇండియా ర్యాంకుల జాబితా, కట్-ఆఫ్ మార్కులను కూడా ఎన్టీఏ విడుదల చేయనుంది. అలాగే తుది ఆన్సర్ కీ కూడా ఈ రోజు విడుదల చేస్తుంది. ఫలితాలలో సబ్జెక్టుల వారీగా ఎన్టీఏ స్కోర్లు, మొత్తం పర్సంటైల్, కేటగిరీ వారీగా ర్యాంకులు, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారా లేదా అనే వివరాలు కూడా వెల్లడిస్తారు.
ఇక జేఈఈ అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 23న ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్సైట్లో ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ మే 2, 2026గా నిర్ణయించింది. ఈ ఏడాది JEE అడ్వాన్స్డ్ 2026ను ఐఐటి రూర్కీ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష విదేశీ పౌరులు, OCI/PIO అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉంటుంది. వీరి కోసం ఐఐటి రూర్కీ ప్రత్యేకంగా ఒక రిజిస్ట్రేషన్ విండోను తెరిచింది. జేఈఈ మెయిన్లో మొదటి 2.5 లక్షల ర్యాంకుల్లో నిలిచిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ 2026కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ 2026 రాత పరీక్ష మే 17, 2026న నిర్వహిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.