Reading Time: < 1 minute
Srisailam Ugadi Mahotsavam 2026 5 Day Grand Celebrations From March 16 To 20

Ugadi Mahotsavam 2026: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) ఎస్. శ్రీనివాసరావు వెల్లడించారు. ఉత్సవ ఏర్పాట్లపై ఆయన అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

పది రోజుల పాటు స్పర్శ దర్శనం
ఉగాది పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. సాధారణంగా ఉత్సవ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది. కాబట్టి, భక్తుల కోరిక మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు (మొత్తం 10 రోజులు) స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించారు.

తరలిరానున్న కన్నడ భక్తులు
ఉగాదికి వారం రోజుల ముందు నుంచే కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు కాలినడకన క్షేత్రానికి చేరుకుంటారు. కన్నడ భక్తులు భ్రమరాంబా దేవిని తమ ఆడపడుచుగా భావించి చీర, సారె సమర్పించడం ఇక్కడి ఆచారం. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అటవీ ప్రాంతంలోని పాదయాత్ర మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ ప్రాంతం మరియు క్యూ లైన్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఈవో సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా మంచినీటి సరఫరాను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అన్ని విభాగాల ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి, భక్తులకు మెరుగైన సేవలందించాలని స్పష్టం చేశారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులు, ఈ 10 రోజుల స్పర్శ దర్శన అవకాశాన్ని వినియోగించుకోవాలని దేవస్థానం కోరింది.