
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ఇన్వెస్ట్మెంట్ గురించి పలు విలువైన సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఆయన పెట్టుబడి పెట్టే విధానంతో పాటు భవిష్యత్తులో మంచి రాబడి మార్గాలను కూడా అందరికీ తెలియజేస్తుంటారు. ప్రస్తుతం వెండి ధర ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఏడాది క్రితం వెండి ధర ఎంత తక్కువ ఉందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో వెండిపై ఇన్వెస్ట్ చేయాలని కియోసాకి మొత్తుకున్నారు. ఆయన మాట విన్నవారు ఇప్పుడు ధనవంతులయ్యారు.
అయితే తాజాగా ఆయన వెండి మొత్తాన్ని అమ్మేశారనే ప్రచారం జరిగింది. దీంతో వెండి ధర పడిపోతుందేమో, అందుకే కియోసాకి తన మొత్తం వెండి పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరిగింది. అయితే తాజాగా ఈ ప్రచారంపై ఆయనే స్వయంగా స్పందించారు. తాను వెండిని మొత్తం అమ్మి బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టానన్న వార్తలను ఆయన ఖండించారు. అవి పూర్తిగా అసత్య ప్రచారాలు అని ఆయన స్పష్టం చేశారు.
దీని గురించి ఆయన ఎక్స్లో ఒక పోస్టు చేశారు. వాంకూవర్లో జరిగిన ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం ఈ రూమర్ల గురించి తెలుసుకున్నానని కియోసాకి తెలిపారు. తన పెట్టుబడి వ్యూహంలో వెండికి ఇప్పటికీ ప్రియారిటీ స్థానంలో ఉందని, తాను ఒక్క గ్రాము వెండికూడా అమ్మలేదని స్పష్టం చేశారు. అయితే తన కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి కొంత బిట్కాయిన్, తరువాత కొంత బంగారం అమ్మినట్లు ఆయన అంగీకరించారు. అవి అమ్మి పెద్ద తప్పు చేశానని అన్నారు. వాటిని అమ్మకపోయి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. దేవుడి దయ వల్ల వెండి మాత్రం అమ్మలేదని తెలిపారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి