Reading Time: 2 minutes
BBL Fire Incident: క్రికెట్ స్టేడియంలో చెలరేగిన మంటలు..ప్రాణభయంతో పరుగులు తీసిన జనం!

BBL Fire Incident: ఆస్ట్రేలియాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ మ్యాచ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మంగళవారం (జనవరి 20) పెర్త్ వేదికగా పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతుండగా, స్టేడియంలోని ఒక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెర్త్ ఆప్టస్ స్టేడియం భవనానికి బయటి వైపు ఉన్న ఒక గది నుంచి నల్లటి పొగ భారీగా ఆకాశంలోకి వ్యాపించడంతో స్టేడియంలో ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన జరగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తొలి ఇన్నింగ్స్‌లో పెర్త్ స్కార్చర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టేడియం భవనం నుంచి పొగ రావడం టీవీ స్క్రీన్లపై స్పష్టంగా కనిపించింది. వెంటనే అప్రమత్తమైన స్టేడియం సెక్యూరిటీ సిబ్బంది, అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం స్టేడియం బయటి గదిలో జరగడంతో ప్రాణనష్టం తప్పింది. ఆటగాళ్లకు లేదా ప్రేక్షకులకు ఎటువంటి హాని కలగలేదు. కాసేపు గందరగోళం నెలకొన్నప్పటికీ, మంటలు అదుపులోకి రావడంతో మ్యాచ్‌ను యథావిధిగా కొనసాగించారు. అయితే, ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన SA20 మ్యాచ్ సందర్భంగా స్టేడియం పార్కింగ్‌లో మంటలు రావడం, ఇప్పుడు బిగ్ బాష్‌లో ఇలా జరగడం క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ క్వాలిఫైయర్ పోరులో పెర్త్ స్కార్చర్స్ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఓపెనర్ ఫిన్ అలెన్ 30 బంతుల్లో 49 పరుగులతో మెరుపులు మెరిపించినప్పటికీ, మిగిలిన వారు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ ఆష్టన్ టర్నర్ 29 పరుగులు చేయగా, పర్త్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిడ్నీ సిక్సర్స్ బౌలర్లు మిచెల్ స్టార్క్, బెన్ డ్వార్షుయిస్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పర్త్ జట్టును కట్టడి చేశారు. స్టేడియంలో మంటల టెన్షన్ ఉన్నప్పటికీ, మైదానంలో ఆట మాత్రం రసవత్తరంగా సాగింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..