
Virat Kohli : విరాట్ కోహ్లీ గ్రౌండ్లో ఏం చేసినా అది సంచలనమే. ఇటీవల ఇండోర్లో జరిగిన వన్డే మ్యాచ్లో కోహ్లీ తాగిన ఒక పానీయం, దానికి అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ మధ్యలో ఒక చిన్న గ్లాసుతో బ్రౌన్ కలర్ ద్రావణాన్ని తాగాడు. అది తాగిన వెంటనే కోహ్లీ ముఖం చాలా వింతగా పెట్టి, ఏదో ఘాటైన వస్తువు తిన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు రకరకాలుగా ఊహించుకోవడం మొదలుపెట్టారు. కొందరు అది రమ్ అని సరదాగా అంటే, మరికొందరు ఏదో ఎనర్జీ డ్రింక్ అయి ఉంటుందని భావించారు.
అయితే, క్రీడా నిపుణుల విశ్లేషణ ప్రకారం కోహ్లీ తాగింది పికిల్ జ్యూస్. సాధారణంగా ఆటగాళ్లు తీవ్రమైన ఎండలో ఆడుతున్నప్పుడు లేదా ఎక్కువ సేపు క్రీజులో ఉన్నప్పుడు కండరాలు పట్టేయడం సహజం. ఈ సమస్యను తక్షణమే తగ్గించడానికి ఈ పికిల్ జ్యూస్ ఒక అద్భుతమైన మందులా పనిచేస్తుంది. ఇందులో సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సాధారణ నీటి కంటే 40 శాతం వేగంగా కండరాల నొప్పులను తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
When even Virat Kohli doesn’t like the taste
Bro, WHAT was that drink?#ViratKohli #CricketFans pic.twitter.com/flaSRXSW9J
— Crick Guessing (@Crick_Guessing) January 20, 2026
ఈ పికిల్ జ్యూస్ ఎలా పనిచేస్తుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇది నేరుగా కండరాలపై కాకుండా, నోటిలోని నరాల సంకేతాల ద్వారా మెదడుకు సందేశం పంపి, కండరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. అందుకే దీన్ని తాగడం కంటే, నోట్లో పోసుకుని 20 నుంచి 30 సెకన్ల పాటు పుక్కిలించి మింగడం లేదా ఉమ్మేయడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కోహ్లీ ఇచ్చిన ఆ వింత ఎక్స్ప్రెషన్కు కారణం ఆ జ్యూస్లో ఉండే ఘాటైన వెనిగర్, ఉప్పు రుచే.
క్రీడాకారులు సాధారణంగా గ్లూకోజ్ లేదా ఇతర ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు, కానీ పికిల్ జ్యూస్ అనేది తక్షణ ఉపశమనం కోసం వాడే ఒక ప్రత్యేక సప్లిమెంట్. అయితే, దీన్ని మ్యాచ్కు ముందే తాగడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, నొప్పి మొదలైనప్పుడు లేదా రాబోతుందని అనిపించినప్పుడు మాత్రమే తీసుకోవాలని స్పోర్ట్స్ న్యూట్రిషన్ ప్రొఫెసర్లు సూచిస్తున్నారు. మొత్తానికి కోహ్లీ తాగిన ఆ చిన్న షాట్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఒక పెద్ద చర్చకే దారితీసింది.

