Reading Time: 2 minutes
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవం పక్కన పదేళ్ల బాలుడు..

అన్ని సంబంధాలు దూరమవుతున్న ఈ కాలంలో మరోక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మానవత్వం బతికిలేదు అనిపించేందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. తన తల్లి మరణించిన తరువాత ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాని సమయంలో ఒక పదేళ్ల బాలుడు పడిన కష్టం ఇప్పుడు ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తోంది. మరణించిన తల్లి మృతదేహంతో ఆ బాలుడు ఆసుపత్రికి వెళ్లిన సంఘటన అందరి హృదయాలను కదిలించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఒక జిల్లా ఆస్పత్రిలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని ఒక జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందక HIV, క్షయవ్యాధితో బాధపడుతున్న ఒక మహిళ మరణించింది. తల్లి మరణం తరువాత ఆమె పదేళ్ల కుమారుడు ఆ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగువారు కానీ, ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితిలో ఆ చిన్నారి బాలుడు ఒంటరిగానే తల్లి మృతదేహాన్ని మార్చురీకి తరలించాడు. ఆస్పత్రి సిబ్బందికి అతడికి సాయంగా నిలిచారు. బాలుడి జీవితం అప్పటికే దుఃఖంతో నిండిపోయింది. గత సంవత్సరం అతని తండ్రి కూడా HIV తో మరణించాడు. తన తండ్రికి ఈ వ్యాధి ఉందని తెలుసుకున్న తర్వాత, గ్రామ ప్రజలు, బంధువులు కుటుంబాన్ని పూర్తిగా దూరం పెట్టారు. అతని తండ్రి మరణం తరువాత, అతని తల్లి కూడా తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు, ఆ చిన్న పిల్లవాడు ఆమెను చూసుకోవడానికి చదువు కూడా మానేశాడు.

ఈ క్రమంలోనే తల్లి మరణించిందని తెలియని బాలుడు..ఆమె మృతదేహాన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాడు. కాగా, ఆమెను పరీక్షించిన వైద్యులు తన తల్లి మృతిచెందినట్టుగా నిర్ధారించారు. ఆ బాలుడి కన్నీటి మాటలు ప్రతి ఒక్కరిని, చివరకు రాతి హృదయాన్ని కూడా కరిగించేంతగా ఉన్నాయి. పోలీసులు వచ్చే వరకు కదలకుండా ఆ బాలుడు గంటల తరబడి తన తల్లి మృతదేహం పక్కనే ఆసుపత్రి నేలపై కూర్చున్నాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

హృదయ విదారక దృశ్యాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. బాలుడికి మద్దతు నిలబడి, తన తల్లి మృతదేహానికి పోస్ట్ మార్టం, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది చేసిన సాయంతో మానవత్వం పూర్తిగా చచ్చిపోలేదనే నమ్మకాన్ని నిలబెట్టాయి. ఈ సంఘటన వ్యాధి భయం పేరుతో మానవత్వాన్ని మర్చిపోతున్న నేటి సమాజం క్రూరత్వాన్ని బయటపెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by The CSR Journal (@thecsrjournal)

ఇదిలా ఉంటే, తన తల్లి మరణం బాధలో ఉండగా, ఆ బాలుడు మరో ఆందోళనను కూడా వ్యక్తం చేశాడు. తన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని, తన భూమిని లాక్కోవడానికి బంధువులు కుట్ర పన్నుతున్నారని అతను ఆరోపించాడు. పిల్లవాడి భవిష్యత్తు, భద్రత కోసం సమాజం, ప్రభుత్వం నుండి ప్రతిస్పందన చాలా అవసరం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..