Reading Time: 2 minutes
Parasakthi Movie: ‘పరాశక్తి’కి నిరసన సెగ.. సినిమాను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్.. ఏం జరిగిందంటే?

సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సినిమా పరాశక్తి. పీరియాడికల్ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో రవి మోహన్ (జయం రవి), అధర్వ మురళి ప్రధాన పాత్రలు పోషించారు. లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన పరాశక్తి సినిమా మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. మొదట పాన్ ఇండియా రిలీజ్ అనుకున్న ఈ మూవీ కేవలం తమిళ్ వెర్షన్ లో మాత్రమే రిలీజైంది. థియేటర్ల కొరతతో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ కాలేదు. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం, తదితర సంఘటనల ఆధారంగా పరాశక్తి సినిమాను తెరకెక్కించారు సుధ కొంగర. మొదటి నుంచి ఈ సినిమా కంటెంట్ పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మూవీ రిలీజయ్యాక ఆ నిరసనల వేడి మరింత పెరిగింది. తాజాగా పరాశక్తి సినిమాను బ్యాన్‌ చేయాలంటూ తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

‘‘పరాశక్తి’ సినిమాను కచ్చితంగా నిషేధించాలి. చరిత్రను తప్పుదోవ పట్టించే ఎన్నో సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. శివకార్తికేయన్‌ పాత్ర ఇందిరాగాంధీని కలిసినప్పటి సన్నివేశాలు అన్నీ చిత్ రబృందం ఊహించుకొని చిత్రీకరించింది. చరిత్రలో జరగని సంఘటనలతో ఈ సినిమాను రూపొందించారు. ఇందులో వాస్తవ సంఘటనలు చాలా తక్కువ ఉన్నాయి. క్లైమాక్స్ లోనూ వివాదాస్పద సన్నివేశాలున్నాయి. వీటిని తక్షణమే తొలగించాలి’ అని తమిళనాడు యూత్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అరుణ్‌ భాస్కర్‌ డిమాండ్ చేశారు.

కాగా పరాశక్తి సినిమా ప్రారంభం నుంచే ఏదో ఒక వివాదంలో నిలుస్తోంది. మొదట టైటిల్‌, తర్వాత సెన్సార్‌ సర్టిఫికెట్‌, ట్రైలర్‌.. ఇలా చాలా అంశాల్లో ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా సినిమాను బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ తెరపైకి వచ్చింది. మరి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.