Reading Time: < 1 minute
Siddaramaiah Hijab Order Saffron Shawls Not Allowed Karnataka

Siddaramaiah: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు హిజాబ్, పవిత్ర దారాలు, తలపాగా ఇతర మతపరమైన చిహ్నాలను ధరించడానికి అనుమతి ఇచ్చింది. అయితే, పాఠశాలల్లో కాషాయ కండువాలకు అనుమతి లేదని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఇప్పుడు ఈ ప్రకటన కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీల మధ్య కొత్త వివాదానికి కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఆచరణలో ఉన్న మతపరమైన వస్త్రధారణ అనుమతి కొనసాగుతుందని, కొత్త వాటిని అనుమతించేది లేదని చెప్పారు. “కాషాయ శాలువలకు అనుమతి లేదు. ఆ శాలువలను ధరించకూడదు. తలపాగాలు, పవిత్ర దారం, శివధార, రుద్రాక్షలు మరియు హిజాబ్‌లను ఎవరి నమ్మకాలకు అనుగుణంగా వారు ధరించవచ్చు. 12వ తరగతి వరకు వీటికి అనుమతి ఉంది” అని బుధవారం చెప్పారు. పాఠశాలల్లో కాషాయ కండువాలకు అనుమతి ఉంటుందా? అని విలేకరి ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. దీనిని బుజ్జగింపు రాజకీయాలుగా అభివర్ణించింది. సిద్ధరామయ్య హిందూ వ్యతిరేకి అని, ఆయన హిజాబ్‌కు అభ్యంతరం చెప్పడం లేదు కానీ, కాషాయ కండువాలకు అభ్యంతరం చెబుతున్నారని, ఇది బుజ్జగింపు రాజకీయం అని బీజేపీ అధికార ప్రతినిధి అశోక్ గౌడ అన్నారు. 2022లో అప్పటి బీజేపీ ప్రభుత్వం పాఠశాలల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్ని రద్దు చేసింది.