
Congress 1000 Days: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలంగాణ భవన్లో ఛార్జ్షీట్ను విడుదల చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
‘ఇది పాలన కాదు.. పీడన’ :
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తి కావడం ఒక ముఖ్యమైన ఘట్టమని కేటీఆర్ అన్నారు. అయితే ఈ 1000 రోజులు పాలనకు కాకుండా ప్రజలకు పీడనగా మారాయని విమర్శించారు. ‘దరిద్రం దండయాత్ర మొదలుపెట్టి వెయ్యి రోజులు అయింది. కేసీఆర్ మాటల్లో ఇది సర్వభ్రష్ట పాలన.. రేవంత్రెడ్డి మాటల్లో ఈ వెయ్యి రోజులు క్రిమినల్ వేస్ట్’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగు తలలతో నాగుపాము బుసలు కొట్టినట్టుగా కాంగ్రెస్ పాలన సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. ఇది వికృత పాలన అని, కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమని ఆరోపించారు.
ఉద్యోగులకు హామీలు ఇచ్చి చివరకు ఉత్త చేతులు చూపించారని కేటీఆర్ విమర్శించారు. 22A పేరుతో భూములను కొల్లగొడుతున్నారని, అవినీతి అనకొండలా పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ప్రభుత్వం ఢిల్లీ ముందు మోకరిల్లుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1000 రోజుల పాలనలో రూ.4.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎంగిలి ఆకుల దగ్గర కుక్కలు కొట్లాడుకున్నట్టుగా పరస్పరం గొడవపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నాం’ :
మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో చేసిన వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నామని తెలిపారు. 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తామని చెప్పి.. వెయ్యి రోజులు పూర్తయినా వాటిని అమలు చేయలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి తలమానికంగా తీర్చిదిద్దారని హరీశ్రావు అన్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క వ్యవస్థ కుప్పకూలుతోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఒక్కో రంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని హరీశ్రావు విమర్శించారు. పురోగమనం వైపు వెళ్లాల్సిన తెలంగాణను తిరోగమనం దిశగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు.