Reading Time: < 1 minute
Chittoor Elephant Death Pawan Kalyan Orders Probe Into Electric Shock Incident

Elephant Death: చిత్తూరు జిల్లా పుంగనూరు, మంగళంపేట అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. 13 ఏనుగులతో కూడిన గుంపులో ఒక మగ ఏనుగు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మంగళంపేట పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం బోర్‌వెల్ మోటార్‌కు అనుసంధానించిన విద్యుత్ తీగ ఏనుగుకు తగలడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ఏనుగు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెంది ఉండవచ్చని తెలిపారు. అయితే మృతికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై అటవీ శాఖ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం మృత ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మృతికి దారితీసిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నారు.

ఏనుగు మృతిపై పవన్ కల్యాణ్‌ విచారం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన తెలుసుకున్నారు. విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. వన్యప్రాణుల సంచారం ఉన్న అటవీ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..