Reading Time: < 1 minute
Pawan Kalyan Jai Kottufor Youth Change And The Future Janasena

Pawan Kalyan’s Youth Message: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ యువజన విభాగాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్, రాష్ట్ర ఆహార అండ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ‘జై కొట్టు’ పేరుతో యువజన విభాగం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘జై కొట్టు’ గేయాన్ని కూడా విడుదల చేశారు.

యువజన విభాగం ఆవిర్భావాన్ని పురస్కరించుకుని జనసేనాని పవన్ కళ్యాణ్ ఆడియో సందేశాన్ని పంపించారు. యువత రాజకీయ, సామాజిక మార్పులో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కేవలం నాయకులు, రాజకీయ పార్టీల కోసం నినాదాలు చేయడం కాకుండా.. సమాజం, యువత భవిష్యత్తు, మార్పు కోసం పనిచేసే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ‘దేహి అని దేనికోసం చేతులు చాపవద్దు.. దేశం కోసం పని చేసే చేతులు కావాలి’ అంటూ యువతలో సేవాభావం, స్వావలంబన పెరగాలని ఆకాంక్షించారు. ‘నేను ఎక్కడ ఉన్నాను అని ప్రశ్నార్థకం వద్దు.. ఇక్కడే ఉన్నాను అని అస్తిత్వం పిడికిలి కావాలి’ అని పేర్కొన్నారు.

ఇన్నాళ్లూ నాయకులు, రాజకీయ పార్టీల కోసం నినాదాలు చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇకపై యువత కోసం, వారి భవిత కోసం, మార్పు కోసం, ప్రజల తీర్పు కోసం ‘జై కొట్టు’ అని నినదించాలని పిలుపునిచ్చారు. పట్టు వదలని ప్రజల కోసం పోరాడే సేనకు జై కొట్టాలని, సమాజంలో మార్పు కోసం యువత ముందుండాలని ఆకాంక్షించారు. యువతలో రాజకీయ చైతన్యంతో పాటు బాధ్యత, సేవా దృక్పథం పెంపొందించాలని తన సందేశం ద్వారా స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘జై కొట్టు’ లోగో, గేయం ఆవిష్కరణతో పార్టీ యువజన విభాగానికి అధికారికంగా కొత్త రూపం లభించింది. యువతను మరింతగా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై స్పందించేలా, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా ‘జై కొట్టు’ను ఉపయోగించుకోవాలని జనసేన భావిస్తోంది.