
చింతూరు ఏజెన్సీ పరిధిలోని గొల్లగుప్ప గ్రామంలో చిన్నారుల వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో, ఈ గ్రామంలో మృతి చెందిన చిన్నారుల సంఖ్య మూడుకు చేరింది. ప్రస్తుతం భద్రాచలం ఆస్పత్రిలో నలుగురు చిన్నారులు చికిత్స పొందుతుండగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
చిన్నారుల వరుస మరణాల నేపథ్యంలో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. గొల్లగుప్ప గ్రామంలో అత్యవసరంగా ప్రత్యేక మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఈ శిబిరం ద్వారా వైద్యులు గ్రామంలోని 75 మందికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. అయితే, మెడికల్ క్యాంప్ నిర్వహించిన తర్వాత కూడా మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది.
ముందస్తు జాగ్రత్త చర్యగా 75 మందిని లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గ్రామంలో చిన్నారుల మరణాలకు గల అసలు కారణాలను గుర్తించేందుకు ప్రత్యేక వైద్య బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.