Reading Time: < 1 minute
Pawan Kalyan Birthday Tragedy Fan Dies Of Electric Shock In Amalapuram

Pawan Kalyan Birthday Tragedy: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో పాల్గొన్న ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. అమలాపురంలోని ఓ కళాశాల సమీపంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుడు బెండమూర్లంక గ్రామానికి చెందిన రోళ్ల ప్రేమ్‌ కుమార్. ప్రేమ్‌ మరణంతో పవన్ కళ్యాణ్ పుట్టినరోజున పెను విషాదం నెలకొంది.

ప్రేమ్‌ కుమార్ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి నిర్వహించాలనే ఉద్దేశంతో స్వగ్రామానికి వచ్చాడు. అమలాపురంలోని ఓ కళాశాల సమీపంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తగలడంతో ప్రేమ్‌ కుమార్‌ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. విద్యుత్ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రేమ్‌ కుమార్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల కోసం ఎంతో ఉత్సాహంగా వచ్చిన యువకుడు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో జనసేన కార్యకర్తలు, స్థానికుల్లో కూడా విషాదం నెలకొంది. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ వైర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా భద్రతా చర్యలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.