
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. రాష్ట్రంలో పన్నుల వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆగస్టు నెలలో ఏపీ పన్నుల రాబడి రూ.25,449.80 కోట్లకు చేరింది. గతేడాది ఆగస్టులో నమోదైన రూ.21,558.09 కోట్లతో పోలిస్తే 18.05 శాతం వృద్ధి నమోదైంది. పన్నుల వసూళ్లను పెంచేందుకు వాణిజ్య పరిజ్ఞానం పన్నుల శాఖ చేపడుతున్న సాంకేతిక, డిజిటల్ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఆగస్టులో రూ.25,449 కోట్లు
ఏపీ ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఆగస్టులో రూ.25,449.80 కోట్ల పన్నుల రాబడి నమోదైంది. గతేడాది ఆగస్టులో ఈ ఆదాయం రూ.21,558.093 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఆగస్టులో పన్నుల రాబడిలో 18.05 శాతం వృద్ధి నమోదైంది. అంటే గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి సుమారు రూ.3,891.71 కోట్ల మేర అధిక వసూళ్లు వచ్చాయి.
పన్నుల వసూళ్లలో AI టచ్
స్థూల పన్నుల రాబడితో పాటు నికర వసూళ్లలోనూ దాదాపు 18 శాతం వృద్ధి నమోదైనట్లు వాణిజ్య పన్నుల శాఖ వెల్లడించింది. పన్నుల చెల్లింపుల్లో అనుసరణ పెరగడం, తనిఖీలు, డేటా ఆధారిత పర్యవేక్షణ ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. పన్నుల ఎగవేతకు చెక్ పెట్టేందుకు వాణిజ్య పన్నుల శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ ఆధారిత స్క్రూటినీపై దృష్టి పెట్టింది. రిటర్నులు, రిజిస్ట్రేషన్లు, ఆడిట్లలో ఏఐ ఆధారిత వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు ఇటీవల GST కౌన్సిల్ అధికారులకు ఏపీ అధికారులు వివరించారు.
వరుసగా పెరుగుతున్న వసూళ్లు
ఆగస్టు గణాంకాలకు ముందే రాష్ట్ర పన్నుల వసూళ్లలో వృద్ధి కనిపించింది. ఏప్రిల్ నుంచి జూలై 2026 వరకు వాణిజ్య పన్నుల మొత్తం వసూళ్లు రూ.20,464.77 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.17,059.65 కోట్లతో పోలిస్తే దాదాపు 20 శాతం వృద్ధి నమోదైంది.
ఖజానాకు కీలకంగా మారిన వాణిజ్య పన్నులు
ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం సొంత పన్ను ఆదాయ లక్ష్యాన్ని రూ.1,25,846 కోట్లుగా నిర్దేశించుకుంది. ఇందులో స్టేట్ జీఎస్టీనే అతిపెద్ద వాటాగా ఉంటుందని బడ్జెట్ అంచనాలు చెబుతున్నాయి. సొంత పన్ను ఆదాయాన్ని గత సవరించిన అంచనాలతో పోలిస్తే 28 శాతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ సొంత పన్ను ఆదాయంలో వాణిజ్య పన్నులదే ప్రధాన వాటా. 2025-26 ఏప్రిల్–నవంబర్ మధ్య రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో వాణిజ్య పన్నుల వాటా 60 శాతానికి పైగా ఉందని రాష్ట్ర ఆర్థిక గణాంకాలు సూచిస్తున్నాయి.
మొత్తంగా.. పన్నుల వసూళ్లలో పెరుగుతున్న వృద్ధి.. మరోవైపు టెక్నాలజీ, ఏఐ ఆధారిత పర్యవేక్షణ.. ఇవన్నీ కలిపి రాష్ట్ర సొంత ఆదాయాన్ని పెంచడంలో కీలకంగా మారుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..