
Vedika Pinto: బాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడు లక్ష్య. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’ (Kill) సినిమాతో వెండితెరకు కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఎన్ఎస్జీ కమాండో అమృత్ రాథోడ్గా ఆయన చేసిన యాక్షన్ స్టంట్స్ కి గాను ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘రాఖ్’ ఫేమ్ దర్శకుడు ప్రోసిత్ రాయ్ తెరకెక్కిస్తున్న ఒక సరికొత్త సైకలాజికల్ రొమాంటిక్ డ్రామాలో నటించబోతున్నారు. అయితే ఇందులో ‘ముసాఫిర్ కేఫ్’ ఫేమ్ నటి వేదిక పింటో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సైకలాజికల్ డ్రామాలో ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాలో వేదికా పింటో, లక్ష్య సరసన నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రోసిత్ రాయ్ తన గత చిత్రాలకు భిన్నంగా సైకలాజికల్ ప్రేమకథను రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సినిమాలో వేదికా పింటో పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘ముసాఫిర్ కేఫ్’ తర్వాత ఆమె పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనుంది. ముఖ్యంగా సైకలాజికల్ డ్రామాలో నటనకు ఎక్కువ స్కోప్ ఉండటంతో వేదికా పింటోకు ఈ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పే అవకాశం కూడా ఉంది. ప్రోసిత్ రాయ్ డైరెక్షన్ స్టైల్ కూడా ఈ ప్రాజెక్ట్ కు అంచనాలు పెంచుతోంది. రొమాంటిక్ సినిమా తరహాలో కాకుండా, ప్రేమ వెనుక ఉన్న మానసిక స్థితిగతులను కథలో మలచనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ముందుకు తీసుకెళ్ళి, త్వరలోనే షూటింగ్ ప్రారంభించి, 2027లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా టైటిల్, పూర్తి తారాగణం, కథకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ ఆఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది.