Reading Time: 2 minutes
Off The Record About Ysrcp Local Body Elections Jagan Focuses On Candidates In Charges

Off The Record: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైసీపీ అధిష్ఠానం ముందుగానే కసరత్తు మొదలుపెట్టింది. గ్రామ స్థాయి నుంచి ప్రతి దశలోనూ గట్టి పోటీ ఇచ్చేలా అభ్యర్థులను సిద్ధం చేయాలని నాయకుల్ని ఆదేశించారు పార్టీ అధ్యక్షుడు జగన్‌. ప్రతి గ్రామంలో పార్టీ తరపున అభ్యర్థి ఉండాలని, ప్రతి వార్డులో పోటీ జరగాలని వార్నింగ్ బెల్స్ మోగించ‌టంపై ఇప్పుడు ఇంటర్నల్‌గా గట్టి చర్చలే జరుగుతున్నాయట. కేవలం అభ్యర్థులను నిలబెట్టడంతోమే సరిపెట్టకుండా….కీలక పదవులపై కూడా ముందుగానే ఫోకస్ పెట్టాలని.. బలమైన అభ్యర్థులను ముందుగానే గుర్తించి స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలు.. స్థానిక విభేదాలు.. నాయకుల మధ్య ఈగోలు ఎన్నికల సమయంలో పార్టీకి ఇబ్బంది కలిగించకుండా చూడాలని, వ్యక్తుల కంటే పార్టీ గెలుపే ముఖ్యం అని చెప్పడంతో పాటు అవసరమైతే కుటుంబ సభ్యులను కూడా ఎన్నికల బరిలోకి దింపి పార్టీ బలాన్ని పెంచాలని సూచించారట. ఆ రకంగా.. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు వచ్చినా.. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని నేతలకు సూచించటం వెనుక బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయ‌ంటున్నారు. ఇన్ఛార్జ్‌ల పనితీరుపై జగన్ ఫోకస్ చేయ‌టం గురించి ఇప్పుడు పార్టీలో స్థానిక ఎన్నికల కంటే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

ఎన్నికల తర్వాత ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుంటానన్న జగన్.. ఎక్కడ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు.. ఎక్కడ పోటీకి దూరంగా ఉన్నారు.. అభ్యర్థుల ఎంపిక ఎలా జరిగింది.. వారి గెలుపు కోసం నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఎంతవరకు పనిచేశారు.. క్యాడర్‌ను ఏ మేరకు సమన్వయం చేశారు.. లాంటి చాలా అంశాలను పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల విషయంలోనూ ఇలాంటి సమీక్షే జరిగినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మెడికల్ కాలేజీల పీపీపీ నుంచి డీఎస్సీ వరకు పార్టీ వరుస ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది ప్రతిపక్షం. ముఖ్యంగా డీఎస్సీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించినా.. 40 నుంచి 45 నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు జరగలేదన్న ఇంటర్నల్‌ రిపోర్ట్స్ పార్టీ పెద్దల దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనిపిస్తే.. పార్టీకి ఇబ్బందులు తప్పవన్న భావనలో ఉందట అధిష్ఠానం. దీంతో స్థానిక ఎన్నికలు ఇన్ఛార్జ్‌ల పనితీరుకు ఒక రకంగా రిపోర్ట్ కార్డ్‌ అన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.

కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో ఆశించిన స్థాయిలో యాక్టివ్‌గా లేరని భావిస్తున్న కొందరు నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు.. స్థానిక ఎన్నికలు
ఫైనల్ ఛాన్స్ కావొచ్చన్న అంచనాలున్నాయి. వాళ్ళ పనితీరును నిశితంగా పరిశీలించి.. ఆ తర్వాత భవిష్యత్ రాజకీయ బాధ్యతలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మార్పు అవసరమని భావించే చోట ప్రస్తుత ఇంఛార్జ్‌ల పనితీరు ఎలా ఉంది.. పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతారన్న అంశాలను బేరీజు వేసుకుని భవిష్యత్ నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి చెందిన స్థానిక నాయకులను గెలిపించగలిగితే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అదే కేడర్ పార్టీకి బలంగా నిలుస్తుందన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. అందుకే ఈసారి స్థానిక సమరాన్ని కేవలం ఎన్నికగానే కాకుండా నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్ ల‌కు రిపోర్ట్ కార్డ్‌లాగా చూస్తున్నారన్నది పార్టీ వర్గాల మాట. గ్రామంలో గెలుపు నుంచి నియోజకవర్గంలో నాయకత్వం వరకు స్థానిక ఎన్నికల ఫలితాలతో వైసీపీలో కొత్త లెక్కలు మొదలయ్యే అవకాశం ఉందన్నది ఆసక్తికరంగా మారింది.