Reading Time: 3 minutes
Virat Kohli Reflects On Test Captaincy Says He Led Team Like Friends Not Bosses

Virat Kohli: భారత క్రికెట్ జట్టు ఆటగాడు ‘విరాట్ కోహ్లీ’ (Virat Kohli) తన టెస్ట్ కెప్టెన్సీ రోజులను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఏడాది టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ.. తన నాయకత్వ కాలాన్ని భారత టెస్ట్ చరిత్రలో స్వర్ణయుగంగా అభివర్ణించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పోడ్‌కాస్ట్ టీజర్‌లో మాట్లాడిన విరాట్.. ఆ సమయంలో జట్టులో ఉన్న ఆటగాళ్ల మధ్య ఉన్న స్నేహబంధమే విజయాలకు ప్రధాన కారణమని చెప్పాడు.

2014లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మహేంద్రసింగ్ ధోనీ గైర్హాజరీలో టెస్ట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ.. తర్వాత భారత టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ 68 టెస్టుల్లో 40 విజయాలు సాధించింది. వ్యక్తిగతంగా కూడా కోహ్లీ 9,230 పరుగులు, 30 సెంచరీలతో భారత టెస్ట్ క్రికెట్‌లో నాలుగో అత్యధిక పరుగుల ఆటగాడిగా నిలిచాడు.

తన కెప్టెన్సీ కాలాన్ని గుర్తు చేసుకుంటూ విరాట్ మాట్లాడుతూ.. “ఇంతకాలం టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం రావడం, భారత జట్టుకు నాయకత్వం వహించడం నాకు గర్వకారణం. ఆ సమయంలో మేమంతా యువ ఆటగాళ్లమే. దేశం కోసం టెస్ట్ క్రికెట్ ఆడాలనే కలతో వచ్చిన ఆటగాళ్ల బృందంగా మేము కలిసి ఎదిగాం” అని అన్నారు. జట్టులో తనతో పాటు చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్ల మధ్య పెద్దగా వయసు తేడా లేకపోవడం జట్టుకు బలంగా మారిందని కోహ్లీ అన్నాడు. సీనియర్లు, జూనియర్ల మధ్య ఎలాంటి దూరం ఉండేది కాదు. మేమంతా స్నేహితుల్లా ఉండేవాళ్లం. అందుకే ప్రతి ఒక్కరిలో బాధ్యత, జట్టుపై ఓనర్‌షిప్ భావన పెరిగిందని చెప్పాడు.

నేనే కెప్టెన్ అయినా.. జట్టును ముందుకు తీసుకెళ్లేది అందరం కలిసి. వచ్చే ఆరు, ఏడు సంవత్సరాలకు బలమైన జట్టును నిర్మించాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండేది. జట్టును ఇంకా మెరుగ్గా చేయడానికి నేను ఏమి చేయగలనని ప్రతి ఆటగాడు తనను తాను ప్రశ్నించుకునేవాడని కోహ్లీ వివరించాడు. విరాట్ కెప్టెన్సీ కాలంలో భారత్ విదేశాల్లో చారిత్రాత్మక విజయాలు సాధించింది. ముఖ్యంగా 2018-19లో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం భారత క్రికెట్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో కలిపి ఏడు టెస్ట్ విజయాలు సాధించిన ఆసియా కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.

ఫిట్‌నెస్‌పై దృష్టి, దూకుడు ఆటతీరు, బలమైన పేస్ బౌలింగ్ దళాన్ని తయారు చేయడం ద్వారా కోహ్లీ భారత టెస్ట్ జట్టును మరో స్థాయికి తీసుకెళ్లాడు. స్వదేశంలో అశ్విన్-జడేజా స్పిన్ జోడీతో భారత్ అజేయంగా నిలవగా, విదేశాల్లోనూ పోటీని గణనీయంగా పెంచింది. 2022లో దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా, ఆపై యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ టెస్ట్ జట్టును నడిపిస్తున్నాడు.