
CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి పార్టీలు పరస్పర సమన్వయంతో పని చేయాలని, ప్రతి ఒక్కరూ తమ పనితీరుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు అందుబాటులో ఉండటం, వ్యవహారశైలి వంటి అంశాలపై ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశానికి ఎంపీ కేశినేని చిన్ని, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ కూడా పాల్గొన్నారు.
గత ఎన్నికల్లో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని టిక్కెట్లు కేటాయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా పార్టీలో చేరిన వారికి కూడా అవకాశాలు ఇచ్చామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల పనితీరు బాగుంటే ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు వస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రజలలో ప్రత్యర్థులపై ఉన్న వ్యతిరేకతను మాత్రమే ఆధారంగా చేసుకోకుండా, సానుకూల ఓటు పెరిగేలా పనిచేయాలని సూచించారు.
విజయవాడ ఇళ్ల పట్టాల సమస్యకు 3 నెలల్లో పరిష్కారం
విజయవాడ నగరంలోని ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, మూడు నెలలలో సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక సమస్యలు ఉంటే అవసరమైన మేరకు నిబంధనలను సరళీకరించి మానవీయ కోణంలో వ్యవహరించాలని కలెక్టర్కు సూచించారు. అదేవిధంగా విజయవాడ నగర సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకోవాలని, కలెక్టర్ పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ముగ్గురు ఎమ్మెల్యేలతో కమిషనర్ సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
విజయవాడలో పీపీపీ విధానంలో పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మినీ ఎస్టీపీల ఏర్పాటు, ఆటోనగర్ స్లమ్ పునరావాసం, రామకృష్ణా నగర్ వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఓపెన్ ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు వంటి ప్రతిపాదనలకు అంగీకారం తెలిపారు. భవానీపురంలో ఒలింపిక్ ఎక్సలెన్స్ సెంటర్ ఫర్ రోయింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేవీనగర్ నుంచి వాంబే కాలనీ వరకు సింగ్నగర్ వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాంబే కాలనీలో హోల్సేల్ ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నియోజకవర్గాల వారీగా పలు పనులకు ఆమోదం
* నందిగామ నియోజకవర్గంలోని గొట్టిముక్కల సమీపంలో రూ.8 కోట్లతో వంతెనల నిర్మాణం, చెవిటికల్లులో లక్ష్మయ్య వాగుపై హై లెవల్ బ్రిడ్జి, నందిగామలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
* తిరువూరు నియోజకవర్గంలో కట్టలేరు వద్ద హై లెవల్ వంతెన, ఏ.కొండూరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కామన్ ఫెసిలిటీ సెంటర్, ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, తిరువూరులో లెదర్ క్లస్టర్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
* జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పోలంపల్లి ప్రాజెక్టు మరమ్మత్తులు, ఇనాం భూముల సమస్య పరిష్కారం, 30 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సీఎం అంగీకరించారు.
* మైలవరం నియోజకవర్గంలోని హెచ్. ముత్యాంలపాడు వద్ద రూ.10 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. జక్కంపూడి ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
* ఇబ్రహీంపట్నంలో జాస్మిన్ ఫ్లవర్ మార్కెట్ను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఏర్పాటు చేయాలని సూచించిన సీఎం, అక్కడ అన్న క్యాంటీన్ ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.