Reading Time: < 1 minute
Weather Updates: సంక్రాంతికి ఇంటికెళ్లి తిరిగొచ్చేవారికి వాతావరణశాఖ వార్నింగ్.. ఈ సమయంలో ప్రయాణాలు డేంజర్.. అసలు బయటకు రావొద్దు..

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో పొగ మంచుపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం వరకు పొగమంచు విపరీతంగా ఉండే అవకాశమందని, సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ముఖ్యంగా పొగమంచు వల్ల రహదారులు అసలు కనిపించవని, దీంతో వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. పండక్కి తిరుగు ప్రమాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ కీలక సూచనలు జారీ చేసింది. చాలా చోట్ల దట్టంగా పొగ మంచు ఉంటుందని తెలిపింది.

ఉదయం 8 గంటల వరకు పొగమంచు

విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణం అందించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో చాలా చోట్ల పొగ మంచు తీవ్రత కొనసాగుతోందని, రాత్రి నుంచి తెల్లవారుజాము ఉదయం 8 గంటల వరకు పొగ మంచు తీవ్రత ఉంటుందని వెల్లడించారు. సోమవారం వరకు కొన్ని జిల్లాల్లో దట్టంగా పొగ మంచు కురుస్తుందని తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఈస్ట్ గోదావరి, అల్లూరి జిల్లా, వెస్ట్ గోదావరి, కృష్ణ, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఇక సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లా, ఈస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాల్లో దట్టంగా పొగ మంచు కురుస్తుందని పేర్కొన్నారు.

ప్రయాణాలు చేసేవారికి జాగ్రత్తలు

తెల్లవారుజాము నుంచి ఎనిమిది గంటల వరకు పొగ మంచు తీవ్రత ఉంటుంది, ఆయా జిల్లాల్లో విజిబులిటీ సరిగా ఉండదని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ 300 మీటర్లకు పడిపోతుందని, రోడ్డు మార్గంలో ప్రయాణించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వేగాన్ని నియంత్రించుకోవాలని, వాహనాలకు ఫాగ్ లైట్స్ వేసుకొని ప్రయాణించాలని తెలిపింది. అత్యవసరం అయితే తప్ప తెల్లవారుజామున బయలుదేరకపోతేనే మంచిదని, 8 గంటల తర్వాత విజిబిలిటీ క్రమంగా పెరుగుతుందంది. వాహనదారులు పొగ మంచు సూచనల ఆధారంగా సేప్టీ ప్రమాణాలు పాటించాలని వాతావరణశాఖ సూచించింది.