Reading Time: 2 minutes
Virat Kohli: విరాట్ కోహ్లీ రీప్లేస్ మెంట్ వచ్చేశాడ్రోయ్.. 83 సగటుతో బడితపూజే..

Virat Kohli: భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్, టెస్ట్ ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత కోహ్లీ తొలుత టీ20లకు గుడ్-బై చెప్పాడు. ఆ తర్వాత మే 12న టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే, కోహ్లీ ఇప్పటికీ వన్డే క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉంటూ వరుసగా పరుగులు సాధిస్తున్నాడు. కానీ, వన్డేల్లో తన స్థానాన్ని భర్తీ చేయగల సరైన ఆటగాడిని కోహ్లీ (Virat Kohli) సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఈ యువ ఆటగాడు దేశవాళీ వన్డే క్రికెట్‌లో ఏకంగా 83 సగటుతో పరుగులు చేస్తున్నాడు. ఈ గణాంకాలు చూస్తే కోహ్లీ కూడా ఆశ్చర్యపోవాల్సిందే..

విరాట్ కోహ్లీని రీప్లేస్ చేయగల ఆటగాడు ఇతనే..!

విరాట్ కోహ్లీ టెస్టులు, టీ20ల నుంచి తప్పుకున్నప్పటి నుంచి భారత్ ఆయన స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం వెతుకుతోంది. టీ20ల్లో నంబర్ 3 స్థానం కోసం టీమ్ ఇండియా తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి పలువురు ఆటగాళ్లను ప్రయత్నించినప్పటికీ, ఇప్పటివరకు ఎవరూ ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయారు.

కానీ, వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ స్థానాన్ని కర్ణాటక తరపున ఆడే దేవదత్ పడిక్కల్ భర్తీ చేసే అవకాశం ఉంది. పడిక్కల్ ప్రస్తుత ఫామ్ అద్భుతంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అందుకే ఆయన్ని కోహ్లీకి సరైన వారసుడిగా భావిస్తున్నారు.

లిస్ట్-ఏ క్రికెట్‌లో 83 సగటు..

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పడిక్కల్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. తొలుత జార్ఖండ్‌పై 147 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, రెండో మ్యాచ్‌లో కేరళపై 124 పరుగులు చేశారు. ఇక 29వ తేదీన జరిగిన మ్యాచ్‌లో కేవలం 12 బంతుల్లోనే మెరుపు వేగంతో 22 పరుగులు చేశాడు. ఈ నిలకడ కారణంగానే ఆయన్ని కోహ్లీ రిప్లేస్‌మెంట్‌గా చూస్తున్నాడు.

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున పడిక్కల్..

దేవదత్ పడిక్కల్ భారత్ తరపున ఇప్పటివరకు 2 టెస్టులు, 2 టీ20లు ఆడినప్పటికీ అక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే ఆయన ప్రస్తుత ఫామ్‌ను బట్టి బీసీసీఐ మరిన్ని అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. పడిక్కల్ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకే ఆడుతున్నాడు.

2020, 2021 సీజన్లలో ఆర్‌సీబీ తరపున ఆడిన పడిక్కల్, ఆ తర్వాత రెండేళ్లు రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడినా, 2025లో బెంగళూరు ఫ్రాంచైజీ మళ్ళీ ఆయనపై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లోనే 150.60 స్ట్రైక్ రేట్‌తో రెండు అర్థసెంచరీలతో సహా 247 పరుగులు చేసి తన సత్తా చాటాడు.