
ఓ వ్యక్తి అతివేగం మూడేళ్ల చిన్నారి ప్రాణాలు తీసేసిన ఘటన హైదరాబాద్లోని ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డు వద్ద వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న మొహిద్దీన్ అనే వ్యక్తి తన మూడేళ్ల కుమారుడైన ఇజాన్ ఉద్దీన్తో కలిసి స్వీకార్ హోటల్ నుండి పార్శిల్ తీసుకువచ్చేందుకు వెళ్లాడు.. అయితే చిన్నారు రోడ్డు దాటుతున్న క్రమంలో అటుగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బాలుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు బాలుడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సదరు వాహనదారుడు తన కారును అక్కడే వదిలేసి పారిపోయాడు.
ఇక ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన బాలుడిని హాస్పిటల్కు తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో చిన్నారిని అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఒవైసీ హాస్పిటల్కు తరలించారు. కానీ అక్కడికెళ్లినా ఎలాంటి లాభం లేకపోయింది. అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కంటికి రెప్పలా పెంచుకుంటున్న కుమారుడు కళ్లముందు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీల ఆదేశాల మేరకు యాకుత్పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడి, ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం నంబర్ ఆధారంగా పరారీలో ఉన్న డ్రైవర్ను కనిపెట్టే పనిలో ఉన్నారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.