
Pakistan: పాకిస్తాన్లో కీలక పరిణామాలు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉంటే, ఆయన సోదరి అలీమా ఖాన్ను లాహోర్లో పోలీసులు అరెస్ట్ చేసి, కోట్ లఖ్పత్ జైలుకు తరలించడం సంచలనంగా మారింది.
అడియాలా జైలులో ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్కు పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)కు చెందిన వైద్యులు అనేక పరీక్షలు నిర్వహించారు. కంటి వైద్య బృందం, ఇతర వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఇమ్రాన్ ఖాన్కు వివిధ పరీక్షలు నిర్వహించినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. బీపీ, కొలెస్ట్రాల్, కంటిచూపుతో పాటు ఇతర ఆరోగ్య అంశాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన అభిమానులు, కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ పరీక్షలు జరిగాయి.
మరోవైపు, ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ను లాహోర్లోని ఆమె నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 27న పీటీఐ కార్యకర్తలు ఇస్లామాబాద్ మార్చ్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ఖాన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ ర్యాలీకి పిలుపునిచ్చారు. లాహోర్ జిల్లా యంత్రాంగం ఆమెను 30 రోజుల పాటు నిర్బంధించే ఉత్తర్వుల్ని జారీ చేసింది. ప్రజాభద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్నందున ఈ అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. 1960 నాటి చట్టంలోని నిబంధనల ప్రకారం, ఆమెను అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.