
UP Politics:2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) లక్నోలో కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. ఆయనే ముందే ఇద్దరు సీనియన్ ఎస్పీ నేతలు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలోని ఏటా, కాస్గంజ్ జిల్లాల సమాజ్వాదీ పార్టీ జిల్లా కార్యవర్గాలనున రద్దు చేశారు. ఈ రెండు జిల్లాల్లోని పార్టీ అనుబంధ విభాగాలను కూడా రద్దు చేశారు.
లక్నోలో జరిగిన పార్టీ సమావేశానికి రెండు జిల్లాలకు చెందిన 250 మంది సీనియర్ నేతలు, పార్టీ పదాధికారులు హాజరయ్యారు. ఈ సమయంలో పార్టీ నేతలు మంజీత్ యాదవ్, మాజీ ఏటా జిల్లా పంచాయతీ చైర్మన్ జుగేంద్ర సింగ్ యాదవ్ మధ్య వివాదం మొదలైంది. సమావేశంలో జుగేంద్ర సింగ్ చేసన వ్యాఖ్యలపై మంజీత్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కాస్త ఇద్దరి మధ్య గొడవగా మారింది. ఆ సమయంలో అఖిలేష్ యాదవ్, ఇతర సీనియర్ నేతలు అక్కడే ఉన్నారు. ఈ ఘటన తర్వాత రెండు జిల్లాల కార్గవర్గాలతో పాటు రెండు జిల్లాల్లో పార్టీ అనుబంధం సంస్థల్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది.
యూపీ ఎన్నికల కోసం పార్టీ కేడర్ను సిద్ధం చేసే క్రమంలో ఈ కార్యక్రమం జరిగింది. ఏటా జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాస్గంజ్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీల్లో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక దాంట్లో ఎస్పీ ఎమ్మెల్యే గెలిచారు. ఈ ఘటనపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘ఇలాంటివి జరుగుతుంటాయి. పర్లేదు, డబ్బుతో వచ్చే అహంకారం వల్లే ఇదంతా జరుగుతుంది. ఎవరైనా సంపన్నులైతే చివరకు ఇతరులను వదిలిపెడుతారు. ఇప్పుడు మనమంతా కలిసి పనిచేద్దాం’’ అని వ్యాఖ్యానించారు.