Reading Time: < 1 minute
Hyderabad Records Highest Petrol Price In India After Fuel Hike

Hyderabad Petrol Price: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరల మోత మోగింది. చమురు విక్రయ సంస్థలు (OMCs) పెంచిన ధరల కారణంగా మే 15న దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. తాజా పెంపుతో దేశంలోని ప్రముఖ నగరాలన్నింటికంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనే పెట్రోల్ ధర అత్యధికంగా ఉన్నాయి. నగరంలో లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ. 3.39 పెరగడంతో ప్రస్తుతం లీటరు ధర రూ. 110.89 కి చేరింది. ఈ జాబితాలో కేరళ రాజధాని తిరువనంతపురం రెండో స్థానంలో నిలిచింది. అక్కడ రూ. 3.37 పెరగడంతో లీటరు పెట్రోల్ ధర రూ. 110.75 కి చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో కోల్‌కతా (రూ. 108.74), పాట్నా (రూ. 108.55), జైపూర్ (రూ. 108.19) నిలిచాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ. 106 దాటి లీటరు రూ. 106.64 వద్ద విక్రయిస్తున్నారు.

పెట్రోల్‌తో పాటే డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా పైపైకి దూసుకెళ్లాయి. లీటరు డీజిల్ ధర అత్యధికంగా తిరువనంతపురంలో రూ. 99.63 (రూ. 3.37 పెంపు) గా నమోదై, సెంచరీ మార్కుకు చేరువులో నిలిచింది. ఈ జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో లీటరు డీజిల్‌పై రూ. 3.26 పెరగడంతో ధర రూ. 98.96 కి ముట్టింది. ఆ తర్వాత భువనేశ్వర్ (రూ. 96.11), చెన్నై (రూ. 95.47), కోల్‌కతా (రూ. 95.13)లు ఉన్నాయి. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు కొంత తక్కువగా ఉన్నాయి. అక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 97.77 గాను, డీజిల్ ధర రూ. 90.67 గాను కొనసాగుతోంది. ఈ ఆకస్మిక ధరల పెరుగుదల రవాణా రంగంతోపాటు సామాన్యుడి జేబుకు చిల్లుపడనుంది.