Reading Time: 2 minutes
Israel Strikes Tehran Khamenei Death Confirmed Iran Retaliates Gulf Bases

Israel-Iran War: ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేసి చంపేశాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాలు ఈ యుద్ధంలోకి లాగబడ్డాయి. ఇరాన్ ప్రతీకారంగా యూఏఈ, సౌదీ అరేబియా ,ఖతార్‌‌లపై విరుచుకుపడుతోంది. క్షిపణులతో దుబాయ్, అబుదాబి, ఖతార్ సిటీలను టార్గెట్ చేస్తోంది. పెద్ద ఎత్తున ఈ నగరాల్లో శబ్ధాలు వినిపించాయి. దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్టుల్ని ఇరాన్ టార్గెట్ చేసింది.

ఇదిలా ఉంటే, మరోవైపు ఇజ్రాయిల్ భారీ స్థాయిలో ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఆదివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేసింది. నగర వ్యాప్తంగా పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ స్టేట్ మీడియా ఆఫీసు‌పై ఇజ్రాయిల్ దాడి జరిగింది. ఖమేనీ హతమైన ఒక రోజు తర్వాత ఇజ్రాయిల్ ఈ దాడులు చేసింది. “ఐడిఎఫ్ టెహ్రాన్ నడిబొడ్డున ఇరాన్ ఉగ్రవాద పాలనకు చెందిన లక్ష్యాలను ఛేదిస్తోంది. గత రోజులో, ఇజ్రాయెల్ వైమానిక దళం వైమానిక ఆధిపత్యాన్ని స్థాపించడానికి మరియు టెహ్రాన్‌కు మార్గం సుగమం చేయడానికి పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది” అని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) తెలిపాయి.

పేలుళ్ల కారణంగా టెహ్రాన్ గగనతలంలో భారీగా పొగలు కనిపించాయి. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసి మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయిల్ ఇరాన్‌పై ప్రతిదాడులు మొదలుపెట్టింది. మధ్యప్రాచ్యంలోని యూఏఈ, ఖతార్, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియాలు ఇరాన్ దాడుల ఫలితంగా తమ ఎయిర్ స్పేస్ మూసివేశాయి. శనివారం నాటి యూఎస్ ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు మరణించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. దీనికి ప్రతీకారం తప్పదని ఇరాన్ అమెరికాను, ట్రంప్, ఇజ్రాయిల్‌ను హెచ్చరించింది.