
ఎపి హైకోర్టు సరికొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. ఎపి హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సిజె) జస్టిస్ లీసా గిల్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్ – హర్యానా హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి అధికారిక ముద్ర పడడమే తరువాయి, ఆమె అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు. సాధారణంగా ఒక ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తర్వాత కొత్తవారి నియామకం జరిగేది. కానీ, ఈసారి సుప్రీంకోర్టు కొలీజియం తన పనితీరులో కీలక మార్పు తెచ్చింది. ప్రస్తుత సిజెలు రిటైర్ కావడానికి రెండు నెలల ముందే వారి వారసుల పేర్లను కేంద్రానికి పంపిస్తోంది. న్యాయపాలనలో ఎక్కడా విరామం లేకుండా చూడటం, పరిపాలనాపరమైన జాప్యాన్ని నివారించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం. మరోవైపు, మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారిని కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్ ధర్మాధికారి ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.