
న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత, సెంట్రల్ మినిస్టర్ చిరాగ్ పాశ్వాన్కు హత్యా బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. త్వరలోనే ఉగ్రవాదులు మిమ్మల్ని చంపేస్తారంటూ గుర్తు తెలియని దుండగులు లేఖలో ఆయనను హెచ్చరించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కార్యాలయం ధృవీకరించింది.
చిరాగ్ పాశ్వాన్కు మంగళవారం (సెప్టెంబర్ 1) పోస్టు ద్వారా వివరాలు లేని ఒక లేఖ వచ్చిందని.. అందులో ‘హార్డ్కోర్ తీవ్రవాదుల చేతిలో మీరు త్వరలోనే హతమవుతారు’ అని రాసి ఉందని తెలిపింది. చిరాగ్ పాశ్వాన్ అదనపు ప్రైవేట్ కార్యదర్శి అలోక్ కుమార్ ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. బెదిరింపు లేఖపై వెంటనే విచారణ చేపట్టాలని కోరారు.
►ALSO READ | ఈ నవవధువు చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! వరద నీటిలో చిక్కుకున్న బైకర్ కోసం దేవుడిలా వచ్చారు…!
హత్యా బెదిరింపుల నేపథ్యంలో అధికారులు చిరాగ్ పాశ్వాన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన నివాసం, కార్యాలయం దగ్గర సెక్యూరిటీ మరింత టైట్ చేశారు. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా విభాగాలు ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో విచారణను ప్రారంభించాయి. కాగా, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కు కేంద్ర హోంశాఖ ప్రస్తుతం జెడ్-కేటగిరీ భద్రత కల్పిస్తోన్న విషయం తెలిసిందే.