Reading Time: < 1 minute
Man Dies Inside Locked Hdfc Atm Mehdipatnam Hyderabad

Hyderabad: మెయింటెనెన్స్, సాంకేతిక లోపం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. మెహదీపట్నం విజయనగర్ కాలనీ మల్లేపల్లి HDFC ఏటీఎం సెంటర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్‌లో డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వెళ్ళి మృతి చెందాడు. లోపలికి వెళ్లిన అనంతరం అనుకోని విధంగా ఏటీఎం సెంటర్ డోర్ లాక్ అయ్యింది. వ్యక్తి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఊపిరి ఆడక ఏటీఎం సెంటర్‌లోనే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మెహదీపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ యాజమాన్యం సరైన మెయింటెనెన్స్ నిర్వహించిందా? డోర్ లాక్ అవ్వడానికి గల సాంకేతిక కారణాలేంటి? అనే కోణంలో పోలీస్ విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో వ్యక్తి ఏటీఎంలోకి వెళ్ళిన తర్వాత తలుపు లాక్ అవ్వడం వల్ల, లోపల గాలి ఆడక (suffocation) మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని చెక్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం.. ఆ వ్యక్తి ఈ నెల 23న ఉదయం 5:30 గంటలకు ఏటీఎం లోపలికి వెళ్లాడు. సుమారు 6:30 వరకు లోపలే ఉన్నట్లు సీసీ ఫుటేజ్ రికార్డ్ అయ్యింది. మృతదేహంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవు. ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..