Reading Time: < 1 minute
జీతం పడిందా? అయితే ఇలా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే.. 30 శాతం మిగిలినట్టే!

సెప్టెంబర్ నెల జీతం ఖాతాలో పడగానే చాలామంది ముందుగా ఖర్చుల గురించి ఆలోచిస్తారు. అయితే జీతం ఎంత వచ్చినా అందులో కనీసం 30 శాతం మిగిలేలా బడ్జెట్ చేసుకుంటే ఆర్థికంగా మంచి నియంత్రణ సాధించవచ్చు. తక్కువ జీతం నుంచి ఎక్కువ ఆదాయం ఉన్నవారి వరకు అందరికీ ఉపయోగపడేలా ఒక సాధారణ బడ్జెట్ ఫార్ములాను అనుసరించవచ్చు.

జీతంలో 30 శాతం ముందే పక్కన పెట్టాలి

జీతం వచ్చిన వెంటనే 30 శాతాన్ని సేవింగ్స్, పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా కేటాయించడం ఈ ఫార్ములాలో మొదటి నియమం. ఉదాహరణకు నెలకు రూ.30,000 జీతం వస్తే రూ.9,000, రూ.50,000 వస్తే రూ.15,000, రూ.1 లక్ష వస్తే రూ.30,000 వరకు పక్కన పెట్టాలి. ఈ మొత్తాన్ని ముందుగానే సేవ్ చేస్తే మిగిలిన డబ్బుతోనే ఖర్చులను ప్లాన్ చేసుకోవచ్చు.

అవసరాల కోసం 50 శాతం

జీతంలో 50 శాతం వరకు అవసరమైన ఖర్చులకు కేటాయించుకోవచ్చు. ఇందులో ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, కిరాణా సరుకులు, పిల్లల విద్య, ప్రయాణం, EMI వంటి తప్పనిసరి ఖర్చులు ఉండొచ్చు. ఈ ఖర్చులు 50 శాతాన్ని మించకుండా చూసుకోవడం ముఖ్యమైన విషయం.

వీటి కోసం కోసం 20 శాతం

మిగిలిన 20 శాతాన్ని వ్యక్తిగత అవసరాలు, వినోదం, షాపింగ్, బయట భోజనం, సినిమాలు, ఇతర ఐచ్ఛిక ఖర్చులకు కేటాయించుకోవచ్చు. ఈ విభాగంలో ఖర్చులు ఎక్కువైతే సేవింగ్స్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందుగా 30 శాతం సేవ్ చేసి, తర్వాతే ఈ ఖర్చులను ప్లాన్ చేయడం మంచిది.

జీతం ఎంతైనా ఇదే ఫార్ములా

30:50:20 ఫార్ములాను సులభమైన బడ్జెట్ పద్ధతిగా ఉపయోగించుకోవచ్చు. అంటే 30 శాతం సేవింగ్స్ లేదా పెట్టుబడులు, 50 శాతం అవసరాలు, 20 శాతం వ్యక్తిగత కోరికలు. అయితే అద్దె లేదా EMI వంటి ఖర్చులు ఎక్కువగా ఉన్నవారు అవసరాల విభాగాన్ని సర్దుబాటు చేసుకోవాలి. అత్యవసర నిధి, బీమా, దీర్ఘకాలిక పెట్టుబడులకు కూడా 30 శాతం సేవింగ్స్‌లో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భవిష్యత్ ఆర్థిక భద్రతను పెంచుకోవచ్చు.