Reading Time: 3 minutes
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో

80 ఏళ్ల వృద్ధురాలు… వృద్ధాప్యం, అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. సరిగా నడవలేరు. కనీసం నేలపై పాకుతూ వెళ్లే పరిస్థితి కూడా లేదు. కానీ ఆమె మృతదేహం మాత్రం ఇంటికి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బావిలో కనిపించింది. మొదట ఈ ఘటనను ఆత్మహత్యగా భావించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కానీ దర్యాప్తు మొదలైనప్పటి నుంచే పోలీసులకు ఒక ప్రశ్న వెంటాడింది. నడవలేని పరిస్థితిలో ఉన్న మహిళ… ఇంటి నుంచి 300 మీటర్లు దూరంలో ఉన్న బావి వరకు ఎలా వెళ్లగలిగింది? ఆ ఒక్క అనుమానమే ఐదు నెలల పాటు సాగిన దర్యాప్తుకు కారణమైంది. చివరకు బయటపడిన నిజం మాత్రం షాకింగ్‌గా ఉంది. తల్లి ఇంట్లో చనిపోతే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందనే మూఢనమ్మకంతోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలబోతారం గ్రామంలో జరిగింది. ఏప్రిల్ 6న గోనె రవీందర్ అనే వ్యక్తి తన తల్లి గోనె వెంకటమ్మ మృతి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంకటమ్మ వయసు 80 సంవత్సరాలు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. ఆమె మృతదేహం ఇంటికి దూరంగా ఉన్న బావిలో లభించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి తెలిసిన తర్వాత అనుమానాలు మరింత పెరిగాయి. మంచం నుంచి లేచి నడవలేని మహిళ అంత దూరం ఎలా వెళ్లిందన్నదే పోలీసులకు కీలకంగా మారింది. వెంకటమ్మకు నలుగురు కుమారులు. సమ్మయ్య, రవీందర్, కుమారస్వామి, శ్రీనివాస్. ఒక కుమార్తె కూడా ఉంది. నలుగురు కుమారులు వంతుల వారీగా తల్లిని చూసుకునేవారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో వారానికి ఒకరు చొప్పున బాధ్యత తీసుకునేలా ఏర్పాటు చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో మూడో కుమారుడు కుమారస్వామి వంతు ముగియబోతోంది. మరో రెండు రోజుల్లో చిన్న కుమారుడు శ్రీనివాస్ వంతు ప్రారంభం కావాల్సి ఉంది. అప్పటికే వెంకటమ్మ పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో ఆమె ఇంకొన్ని రోజులు మాత్రమే బతికే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు భావించారు. ఈ సమయంలో పెద్ద కుమారుడు సమ్మయ్య తల్లిని ఇక నుంచి అన్నదమ్ముల ఇళ్లకు వంతుల వారీగా తీసుకెళ్లి చూసుకోవాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీనికి కారణం ఒక మూఢనమ్మకం. దుర్ముహూర్తం సమయంలో ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ ఇంటిని కొంతకాలం ఖాళీ చేసి వెళ్లాల్సి వస్తుందనే నమ్మకం కుటుంబంలో ఉంది. గతంలో తండ్రి చనిపోయినప్పుడు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఇదే భయం వెంకటమ్మ హత్యకు దారితీసింది. ఏప్రిల్ 5 రాత్రి కుమారస్వామి తన వంతు ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత… పెద్ద కుమారుడు సమ్మయ్య, చిన్న కుమారుడు శ్రీనివాస్ కలిసి తల్లిని బావిలో పడేసేందుకు పథకం వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ముందుగానే గుర్తించిన వ్యవసాయ బావి వద్దకు వెంకటమ్మను తీసుకెళ్లారు. శ్రీనివాస్ తల్లిని మోసుకుని వెళ్లగా, సమ్మయ్య దారిలో ఎవరూ చూడకుండా జాగ్రత్తపడ్డాడని పోలీసులు తెలిపారు. అనంతరం వెంకటమ్మను బావిలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. మరుసటి రోజు వెంకటమ్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. కొన్ని బావుల్లో నీటిని తోడారు. చివరకు వ్యవసాయ బావిలో ఆమె మృతదేహం కనిపించింది. అనారోగ్యంతో ఉన్న వెంకటమ్మ బావిలో పడి చనిపోయి ఉండవచ్చనే భావనను కుటుంబ సభ్యులు, గ్రామస్థుల్లో కలిగించారు. కానీ పోలీసులకు మాత్రం ఈ కథ నమ్మశక్యంగా అనిపించలేదు. అయితే అనుమానం ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. వెంకటమ్మ శరీరంపై హత్యను నిరూపించే స్పష్టమైన ఆధారాలు వెంటనే లభించలేదు. కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేయలేదు. దర్యాప్తు మధ్యలో విచారణాధికారి బదిలీ కావడం కూడా జరిగింది. అయినప్పటికీ పోలీసులు కేసును వదిలిపెట్టలేదు. ముఖ్యంగా వెంకటమ్మ ఉన్న శారీరక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దర్యాప్తును కొనసాగించారు. గొంతు పిసికి చంపారా? బావిలోకి తోసేశారా? ముందే హత్య చేసి మృతదేహాన్ని బావిలో పడేశారా? అనే కోణాల్లో పరిశీలించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్, కాకతీయ మెడికల్ కాలేజ్ నివేదికలను విశ్లేషించారు. ఈ వైద్య, శాస్త్రీయ ఆధారాల ఆధారంగా వెంకటమ్మది ఆత్మహత్య కాదని, హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను మరోసారి విచారించడంతో దర్యాప్తు సమ్మయ్య, శ్రీనివాస్ వైపు మళ్లింది. పోలీసుల విచారణలో హత్యకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. చివరకు ఇద్దరు కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో షాకింగ్ విషయం ఏంటంటే… వెంకటమ్మ హత్య వెనుక ఆస్తి వివాదం లేదు. డబ్బు కోసం జరిగిన హత్య కాదు. కుటుంబ గొడవలు కూడా ప్రధాన కారణం కాదు. తల్లి ఇంట్లో చనిపోతే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందనే మూఢనమ్మకమే ఈ దారుణానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఒకవైపు తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లి… మరోవైపు ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందనే భయం. చివరకు ఆ భయం కన్నతల్లి ప్రాణాలను బలిగొంది. ఈ కేసులో పోలీసులను ఐదు నెలల పాటు వెంటాడిన ఒక్క ప్రశ్న… మంచం నుంచి లేచి నడవలేని 80 ఏళ్ల మహిళ 300 మీటర్ల దూరంలోని బావి వరకు ఎలా వెళ్లింది? అదే ప్రశ్న చివరకు ఆత్మహత్యగా కనిపించిన ఘటన వెనుక దాగిన హత్యను బయటపెట్టింది. ఇది కేవలం ఒక క్రైమ్ కేసు కాదు. మూఢనమ్మకం ఎంతటి అమానవీయ నిర్ణయానికి దారితీయగలదో చెప్పే విషాద ఘటన.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ChatGPTలో ఇదొక సీక్రెట్ ఫీచర్.. ఫోటోతో స్టిక్కర్ చేయడం ఇంత ఈజీనా?

WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే సెక్యూరిటీ ఫీచర్లు!