Reading Time: 2 minutes
Delhi Gang Rape Woman Gang Raped In Moving Sleeper Bus Driver And Conductor Arrested

Delhi Gang Rape: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న స్లీపర్ బస్సులో 30 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బాధిత మహిళ మంగోల్‌పురిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబంతో కలిసి పిటాంపురాలో నివసిస్తోంది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సరస్వతి విహార్ ప్రాంతంలోని బీ-బ్లాక్ బస్ స్టాండ్ సమీపంలో ఆమె ఈ-రిక్షా నుంచి దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తుండగా ఓ స్లీపర్ బస్సు అక్కడ ఆగింది. ఆ సమయంలో బస్సు దగ్గర ఉన్న వ్యక్తిని సమయం ఎంత అయ్యిందని మహిళ అడగగా, దగ్గరకు రావాలని సంకేతం ఇచ్చిన అతడు ఆమెను బలవంతంగా బస్సులోకి లాగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం బస్సులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కదులుతున్న వాహనంలోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

బస్సు నాంగ్లోయి వైపు కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత నాంగ్లోయి మెట్రో స్టేషన్ సమీపంలో మహిళను దించేసి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు విచారణలో వెల్లడైంది. బాధితురాలు వెంటనే పోలీసులను సంప్రదించగా వారు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గ్యాంగ్‌రేప్‌తో పాటు, సంబంధిత మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా బీహార్ రిజిస్ట్రేషన్ కలిగిన స్లీపర్ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు బస్సులో నుంచి ఆధారాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. బస్సు కిటికీలకు కర్టెన్లు ఉండటంతో బయటివారికి లోపల ఏం జరుగుతుందో కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన డ్రైవర్ ఉమేష్, కండక్టర్ రమేంద్రను అరెస్ట్ చేసి న్యాయస్థాన కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.