Reading Time: < 1 minute
Pm Modi Five Nation Tour Uae Netherlands Sweden Norway Italy

ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. మే 15 నుంచి 20 వరకు ఐదు దేశాల్లో మోడీ పర్యటించనున్నారు. యూఏఈతో పాటు యూరప్ దేశాల్లో పర్యటించి కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలు విదేశాంగ శాఖ కార్యదర్శి సీబీ జార్జ్ వెల్లడించారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను మోడీ సందర్శించనున్నారు. మే 15న యూఏఈలో పర్యటించనున్న మోడీ.. అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ఇంధన సహకారం, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారత్-యూఏఈ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని.. అక్కడ 45 లక్షలకుపైగా భారతీయులు నివసిస్తున్నారని సీబీ జార్జ్ తెలిపారు.

ఇక మే 15 నుంచి 17 వరకు నెదర్లాండ్స్‌లో మోడీ పర్యటించనున్నారు. 2017 తర్వాత మోడీకి ఇది రెండో నెదర్లాండ్స్ పర్యటన కానుంది. ఈ సందర్భంగా జరగనున్న మూడో ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో వాణిజ్యం, పెట్టుబడులు, గ్రీన్ టెక్నాలజీ, ఆవిష్కరణలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక స్వీడన్, నార్వే, ఇటలీ పర్యటనలు భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య ఈ ఏడాది తుది రూపు దిద్దుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది.

పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ ప్రధానమంత్రితో మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే మహారాజు విల్లెం-అలెగ్జాండర్, మహారాణి మాక్సిమా దంపతులను కూడా కలుస్తారు. అంతేకాకుండా భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. అలాగే నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను కూడా కలుస్తారని సీబీ జార్జ్ పేర్కొన్నారు. మే 17న స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌‌లో మోడీ అధికారిక పర్యటన జరపనున్నారు.