Reading Time: 2 minutes
Naga Vamsi Press Meet Tollywood Revenue Sharing Dispute Exhibitors Vs Producers

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ‘ఎకో సిస్టమ్’ అని, ఇందులో ఏ ఒక్కరు ఇబ్బంది పడినా మిగిలిన ఇద్దరిపై ఆ ప్రభావం పడుతుందని నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లు తమ గోడును వెళ్లబోసుకుంటూ మీడియా ముందుకు రావడంపై స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదని ఆయన గుర్తు చేశారు. ఎగ్జిబిటర్లు ఫలానా తేదీ లోపు నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్లు విధించడం లేదా బెదిరింపు ధోరణితో మాట్లాడటం సరికాదని నాగవంశీ హితవు పలికారు. “ఇండస్ట్రీలో ఉన్న మేమంతా ఇప్పటికే కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టి ఉన్నాం. ఇక్కడ ఉన్న నిర్మాతల వద్ద కనీసం 25 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. 70 నుండి 80 శాతం బడ్జెట్ పూర్తయిన సినిమాలపై ఇప్పుడు అకస్మాత్తుగా కొత్త నిబంధనలు రుద్దడం ఏమాత్రం సబబు కాదు” అని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న సినిమాల విషయంలో పర్సెంటేజ్ విధానానికి తాము అంగీకరించబోమని నాగవంశీ తెగేసి చెప్పారు. ఒకవేళ ఎగ్జిబిటర్లు పట్టుబడితే, భవిష్యత్తులో ప్రారంభమయ్యే కొత్త సినిమాల విషయంలో దీనిపై ఆలోచిస్తామని తెలిపారు. అయితే దానికి కూడా కొన్ని కీలక షరతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అన్ని థియేటర్లకు ఒకే పర్సెంటేజ్ కుదరదు. వసతుల ఆధారంగా గ్రేడింగ్ ఉండాలి. థియేటర్ల నిర్వహణ ఖర్చులపై స్పష్టత ఉండాలి. కన్వీనియన్స్ ఛార్జీల విషయంలో పారదర్శకత అవసరం.

మల్టీప్లెక్స్ రంగంలో చక్రం తిప్పుతూ, వందల స్క్రీన్లు నిర్వహిస్తున్న ఒక పెద్ద ఎగ్జిబిటర్.. నిన్నటి ప్రెస్ మీట్‌లో సింగిల్ స్క్రీన్ల కష్టాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని నాగవంశీ ఎద్దేవా చేశారు. మల్టీప్లెక్స్ ల వల్లే సింగిల్ స్క్రీన్ల ఆదాయానికి గండి పడుతోందనే నిజాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు. ఇతర భాషా పరిశ్రమలలో పర్సెంటేజ్ విధానం ఉందని ఎగ్జిబిటర్లు చెబుతున్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ఆ రాష్ట్రాల్లో సినీ రంగం ఆర్థికంగా మనకంటే వెనకబడి ఉందని, తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికీ మెరుగైన స్థితిలో ఉందని ఆయన తెలిపారు. బాగున్న వ్యవస్థను వెనక్కి తీసుకెళ్లడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.ఎగ్జిబిటర్ ఎంత ముఖ్యమో, డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే ముఖ్యం కదా. అలాంటిది డిస్ట్రిబ్యూటర్ ను చంపేసి, ఎగ్జిబిటర్ ను కాపాడాలి అనడం ఎంతవరకు కరెక్ట్?. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మెరుగైన వసతులు కల్పిస్తే.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది.” అని నాగవంశీ ముగించారు. ఈ వివాదం సద్దుమణగాలంటే ఇరు వర్గాలు పంతాలకు పోకుండా, సామరస్య పూర్వకమైన చర్చల ద్వారా మధ్యేమార్గాన్ని వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే సినిమా కంటెంట్ తగ్గిపోయి, అంతిమంగా థియేటర్లు మూతపడే ప్రమాదం పొంచి ఉంది.