Reading Time: < 1 minute
Prateek Yadav Funeral Lucknow Akhilesh Yadav Brother Death Updates

Prateek Yadav: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సోదరుడు ప్రతీక్ యాదవ్ అంత్యక్రియలు గురువారం లక్నోలోని బైకుంఠ ధామ్‌లో ముగిశాయి. ఆయన అంత్యక్రియలకు రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో ఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అల్లుడి చితికి నిప్పంటించిన మామ..
సాధారణంగా కొడుకులు లేదా సోదరులు అంత్యక్రియలు నిర్వహిస్తారు, కానీ ఇక్కడ ఒక అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది. అపర్ణా యాదవ్ తండ్రి, సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ సింగ్ బిష్ట్ తన అల్లుడు ప్రతీక్ యాదవ్ చితికి నిప్పంటించారు. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. అఖిలేష్ యాదవ్‌తో సహా కుటుంబ సభ్యులందరూ ఈ కడసారి వీడ్కోలులో పాల్గొన్నారు. అంత్యక్రియల సమయంలో ప్రతీక్ యాదవ్ కుమార్తెలు ప్రథమ, ప్రతీక్షలను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. పెద్ద కుమార్తె ప్రథమ చాలా సేపు అఖిలేష్ యాదవ్ పక్కనే కూర్చొని కన్నీరుమున్నీరైంది. అపర్ణా యాదవ్ భర్త మరణవార్త విన్న సమయంలో ఆమె అస్సాంలో ఉన్నారు. వెంటనే ఆమె లక్నో చేరుకోగా, అఖిలేష్ యాదవ్ ఆమెను పరామర్శించి మాట్లాడారు.

ప్రతీక్ యాదవ్‌కు జంతువులంటే అమితమైన ఇష్టం. ఆయన అంతిమయాత్రలో శవపేటికను పువ్వులతో అలంకరించడమే కాకుండా, ఆయన పెంపుడు కుక్కలతో ఉన్న ఫోటోలను కూడా ఉంచారు. వందలాది మంది ప్రజలు, రాజకీయ నేతలు ఈ అంతిమ యాత్రలో పాల్గొని ఆయనకు కడసారి వీల్కోలు పలికారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్వయంగా వారి నివాసానికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించారు.

అసలేం జరిగిందంటే..
పలు నివేదికల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పనిమనిషి ప్రతీక్ యాదవ్‌ను గదిలో అపస్మారక స్థితిలో ఉండటం గమనించారు. వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నిజానికి ప్రతీక్ యాదవ్ గత కొంతకాలంగా ‘పల్మనరీ ఎంబోలిజం’ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మే మొదటి వారంలో ఆయనకు కాలికి శస్త్రచికిత్స జరిగింది. గతంలో మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నప్పటికీ, తాజాగా ఆయన అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీకి చెందిన పలువురు నేతలు ప్రతీక్ యాదవ్ మృతికి సంతాపం ప్రకటించారు.