Reading Time: < 1 minute

దేశవ్యాప్తంగా సంచలనం సృస్తించిన చర్లపల్లి ఆత్మహత్యల కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడు నెలల క్రితం తన ఇద్దరు పిల్లలతో సహా సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయారెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిన ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తీవ్రమైన మానసిక ఒత్తిడి.. ఒంటరితనం వల్లే పిల్లలను బలవంతంగా తీసుకెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా విచారణలో పోలీసులు తేల్చేశారు. అయితే అప్పట్లోనే విజయారెడ్డి కుటుంబ సభ్యులపై వెల్లువెత్తిన ఆరోపణలు వచ్చాయి. దుబాయిలో ఉద్యోగం చేస్తున్న విజయ రెడ్డి భర్త.. ఈ ఘటన తర్వాత ఇండియాకు వచ్చాడు. ఆయన కూడా ఆత్మహత్యకు కారణం తెలియదని తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. అన్యోన్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశాడు. కానీ తాజాగా ఆయన చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. 

తన భార్య కుటుంబ సభ్యుల నుండి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులను విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఆశ్రయించాడు. తన భార్యా పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్లు కాదని, ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల వల్లనే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారని సురేందర్ రెడ్డి ఆరోపించాడు.వాళ్లు చనిపోయిన కొద్దిరోజులకే ఆమె కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం తనను వేధించారని, కాబట్టి తనకు రక్షణ కల్పించాలని సురేందర్ రెడ్డి కోరాడు. విజయారెడ్డి ఆత్మహత్యకు తన అత్త పుష్పలత, బామ్మర్ది చిరంజీవిలే కారణమని అన్నాడు. సొంత వాళ్లే నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తి కోసమే నా కుటుంబాన్ని నాకు కాకుండా చేశారు అని బాధపడ్డాడు. భార్య పిల్లలు చనిపోయిన బాధలో తానుంటే.. 25 రోజులకే తనని బెదిరించారని.. తాను చనిపోతే.. నా ఆస్తి మొత్తం తల్లిదండ్రులకి, ట్రస్ట్ కి రాస్తానని తేల్చి చెప్పేశాడు. తన భార్య పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాళ్లు కాదని అన్నాడు.