CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం

CM Chandrababu : రాష్ట్రంలో భూ రికార్డుల భద్రతను సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ, భూ వివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్గా ‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రెవెన్యూ శాఖ రూపొందించిన ఈ ఆధునిక సాంకేతిక విధానం ద్వారా ప్రతి ల్యాండ్ పార్సెల్కు ప్రత్యేక డిజిటల్ ఐడీ కేటాయించనున్నారు. దీనివల్ల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయడానికి వీలుండదు. ప్రధానంగా డబుల్ రిజిస్ట్రేషన్ల సమస్యలను అరికట్టడంతో పాటు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే వేదికపైకి తెస్తూ భూ లావాదేవీలలో ‘సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్’గా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.
ఏడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు
ఎన్ఐసీ ఆంధ్రప్రదేశ్ , బెంగళూరులోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ’ సంస్థలు సంయుక్తంగా ‘హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్’ టెక్నాలజీతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. తొలిదశలో భాగంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని ఒక్కో మండలంలో దీనిని పైలట్ ప్రాజెక్ట్గా అమల్లోకి తెచ్చారు. కర్నూలు (ఆస్పరి), చిత్తూరు (పెనుమూరు), బాపట్ల (రేపల్లె), కృష్ణా (గన్నవరం), తూర్పు గోదావరి (కడియం), పార్వతీపురం మన్యం (గుమ్మలక్ష్మీపురం), విజయనగరం (కొత్తవలస) మండలాల్లోని 89 రీ-సర్వే గ్రామాలకు చెందిన 1,37,763 ల్యాండ్ పార్సెల్ మ్యాప్లను ఈ ప్రాజెక్ట్ పరిధిలోకి తీసుకువచ్చారు. ప్రారంభోత్సవంలో మంత్రి అనగాని సత్య ప్రసాద్, సీఎస్ సాయి ప్రసాద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భూ సమస్యలకు ముగింపు పలకడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. భూ రికార్డుల్లో లోపాల వల్ల అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, గత ప్రభుత్వ హయాంలో ’22ఏ’ పేరుతో కక్షసాధింపు చర్యలకు పాల్పడటంతో వివాదాలు మరింత పెరిగాయని విమర్శించారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ల్యాండ్ లిటిగేషన్లు తక్కువే అయినప్పటికీ, రికార్డులను ప్రక్షాళన చేస్తూ పట్టాదార్ పాస్ పుస్తకాలపై రాజముద్ర వేసి ఇస్తున్నామని తెలిపారు. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుటుపల్లి వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాలకు తమ ప్రభుత్వం విముక్తి కల్పించిందని గుర్తుచేశారు.
నవంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ
ప్రస్తుతం ప్రారంభించిన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అమలును రెండు నెలల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విధానంలో ఏవైనా సాంకేతిక లోటుపాట్లు ఉంటే వాటిని నమోదు చేసేందుకు ప్రత్యేకంగా ఒక కంప్లైంట్ సెల్ను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటి నుంచి సర్వే పూర్తయిన గ్రామాలన్నింటినీ ఈ బ్లాక్ చెయిన్ పరిధిలోకి తీసుకెళ్తామని, నవంబర్ నాటికి ఈ సాంకేతికతను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. భూ సమస్యలన్నీ పరిష్కారమైతే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు గణనీయంగా తగ్గుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.